ఖైరతాబాద్, డిసెంబర్ 17 : అసలే చలికాలం.. గంటకు 64 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు.. మంచుతుఫాను.. మైనస్ 40 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత. ఇంతటి ప్రతికూల పరిస్థితుల్లో మొక్కవోని ధైర్యంతో రష్యాలోని ఎల్బ్రస్ శిఖరాన్ని అధిరోహించారు యాదాద్రి భువనగిరి జిల్లాకు చెందిన 23 ఏండ్ల పడమటి అనితారెడ్డి. పర్వతారోహణపై ఉన్న మక్కువతో ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన శిఖరాలను అధిరోహించి తన సత్తా చాటుకున్నారు. ఆర్థికంగా వెనుకబడిన ఆమె దాతల సాయంతో లక్ష్యం వైపు అడుగులు వేశారు. చలికాలంలో మౌంట్ ఎల్బ్రస్ పర్వతమెక్కిన తొలిభారతీయ మహిళగా ఖ్యాతిగడించారు. సోమాజిగూడ ప్రెస్క్లబ్లో శుక్రవారం సాయంత్రం మీడియాతో ఆమె మాట్లాడారు. వ్యవసాయ కుటుంబంలో పుట్టిన అనిత ట్రెక్కింగ్, పర్వతారోహరణపై ఉన్న మక్కువతో 2015లో భువనగిరిలోని రాక్ ైక్లెబింగ్ స్కూల్లో శిక్షణ తీసుకున్నారు. 2015లో మొదటిసారిగా సముద్రమట్టానికి 4,500 మీటర్ల ఎత్తున్న మౌంట్ రీనాక్, 2019లో మౌంట్ బీసీ రాయ్ (6000 మీటర్లు), 2021 జనవరి 21న సౌతాఫ్రికాలోని మౌంట్ కిలిమంజారో (5849 మీటర్లు), ఫిబ్రవరి 21న మౌంట్ ఖడే (6000 మీటర్లు), తాజాగా సముద్రమట్టానికి 16,500 అడుగుల ఎత్తున్న మౌంట్ ఎలబ్రస్ పర్వతాన్ని ఈ నెల 7న అధిరోహించారు. పర్వతారోహకులు సాధారణంగా చలికాలంలో సాహసం చేయరు. కానీ అనితారెడ్డి శీతాకాలంలోనే పర్వతాన్ని అధిరోహించిన తొలి భారతీయ మహిళగా గుర్తింపు పొందారు. 4,200 మీటర్ల ఎత్తులో పది మీటర్ల భారత త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసి సత్తా చాటారు. ప్రపంచంలోని అత్యంత ఎత్తయిన శిఖరాలను అధిరోహించాలన్నది తన లక్ష్యమని పేర్కొన్నారు. త్వరలోనే మౌంట్ ఎవరెస్ట్, నార్త్ అమెరికాలోని డెనాలీ, కే2 పర్వతాలను ఎక్కాలన్నది తన లక్ష్యమని చెప్పారు.