హైదరాబాద్ : రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో భక్తుల కోరిక మేరకు ఆలయ పూజ సేవలను విస్తరించనున్నట్లు దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. శనివారం అరణ్య భవన్లో ఆలయ సేవల విస్తరణ, ఆన్ లైన్ సేవలు, కొత్తగా ధూప దీప నైవేద్య పథకం అమలు, దేవాదాయ శాఖ భూముల గెజిట్ నోటిఫికేషన్, తదితర అంశాలపై మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ఆ శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ప్రధానంగా ఆలయ సేవల విస్తరణ, భక్తులకు మెరుగైన సేవలపై చర్చించారు.
ఈ సందర్భంగా మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి మాట్లాడుతూ.. శ్రీవైష్ణవ, శివాలయాలు, అమ్మవార్ల దేవాలయాల్లో ఆగమ సంప్రదాయాలకు అనుగుణంగా నిర్వహిస్తున్న పూజ సేవలను మిగితా దేవాలయాలకు విస్తరించనున్నట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం కొన్ని దేవాలయాల్లో లేని పూజ సేవలను కొత్తగా భక్తులకు అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలిపారు. 74 ఆలయాల్లో డిసెంబర్ 10 లోగా ఈ సేవలను భక్తులకు అందుబాటులోకి వస్తాయని చెప్పారు. ఆయా ఆలయాల్లోని సేవలు, పూజల వివరాలను దేవాదాయ శాఖ వెబ్ సైట్ endowments.ts.nic.in/ లో భక్తులో కోసం అందుబాటులో ఉంచినట్లు చెప్పారు.