Eye Donation | మంచిర్యాల : ఓ రైల్వే ఉద్యోగి గుండెపోటుతో మృతి చెందగా, అతని కళ్లను దానం చేసి గొప్ప మనసు చాటుకున్నారు కుటుంబ సభ్యులు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులను సదాశయ ఫౌండేషన్ సభ్యులు అభినందించారు.
వివరాల్లోకి వెళ్తే.. మంచిర్యాల జిల్లాకు చెందిన ఎంబడి రాజు(55) ఇండియన్ రైల్వేస్లో ఉద్యోగి. శుక్రవారం ఆయన గుండెపోటుతో మరణించారు. దీంతో రాజు నేత్రాలను దానం చేయాలని కుటుంబ సభ్యులు నిర్ణయించారు. సదాశయ ఫౌండేషన్ను ఆశ్రయించి, నేత్రాలను దానం చేస్తున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. అనంతరం నేత్రాలను దానం చేసి గొప్ప మనసు చాటుకున్నారు.
ఈ సందర్భంగా సదాశయ ఫౌండేషన్ సభ్యుడు శ్రవణ్ కుమార్ మాట్లాడుతూ.. రాజు నేత్రాలను మరో ఇద్దరు వ్యక్తులకు ట్రాన్స్ప్లాంట్ చేస్తామన్నారు. రాజు నేత్రాల వల్ల మరో ఇద్దరికి చూపు రావడం సంతోషంగా ఉందన్నారు. రాజు భార్య రాధక్క, కుమారుడు తిరుపతి, కోడలు రమ్య, కూతుళ్లు పుష్పలత, మళ్లీశ్వరి, అల్లుళ్లు శంకర్, సదానందానికి శ్రవణ్ కుమార్ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.