హైదరాబాద్: సర్వజనుల ఆరోగ్యమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కంటి వెలుగు (Kanti velugu) పథకం విజయవంతంగా కొనసాగుతున్నది. ఈపథకాన్ని జనవరి 19 నుంచి జూన్ 15 వరకు 100 రోజుల కార్యక్రమాన్ని జిల్లాలో విజయవంతం చేసేందుకు జిల్లా కలెక్టర్లు, వైద్య ఆరోగ్యశాఖ అధికారులు, పలు శాఖల అధికారులతో కలిసి శిబిరాల నిర్వహణకు ముందుగానే ప్రణాళికలు రూపొందించి అమలు చేస్తున్నారు. ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాల మేరకు రాష్ట్రవ్యాప్తంగా ముందస్తు ప్రణాళికలతో, నిరంతర పర్యవేక్షణ, రోజువారి సమీక్షలు, విశ్లేషణ, వీడియో కాన్ఫరెన్స్, సమావేశాలతో ఎప్పటికప్పుడు లోటుపాట్లు సవరించుకుంటూ కంటి వెలుగు కార్యక్రమాన్ని పకడ్బందీగా అమలు చేస్తున్నారు.
అందత్వరహిత తెలంగాణ లక్ష్యంగా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం కింద ఇప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా 63లక్షల 82 వేల 201 మందికి కంటి పరీక్షలు చేసి దృష్టిలోపం ఉన్న 11 లక్షల 40 వేల మందికి ఉచితంగా కళ్లద్దాలు, మందులను పంపిణీ చేశారు. ప్రభుత్వ వైద్యంతో పేద మధ్యతరగతి కుటుంబాలకు వేలాది రూపాయలు ఆదా అవుతున్నాయి.
అన్ని జిల్లాలో అత్యధికంగా దగ్గరిచూపు కనిపించక ఇబ్బందిపడే వారే అధికంగా ఉన్నట్లు శిబిరాలలో నమోదవుతున్న గణాంకాలు వెల్లడిస్తున్నాయి. 40 ఏండ్ల వయస్సు పైబడిన చాలామందికి దగ్గర చూపు కనిపించడం లేదని శిబిరానికి వస్తున్నారు. ఇలాంటి వారికి తక్షణమే రీడింగ్ గ్లాసెస్ అందజేస్తున్నారు. ఇవి కాకుండా కంటి సమస్యలతో వస్తున్న చాలామందికి చుక్కల మందులతో పాటు విటమిన్ ఏ, డీ, బీకాంప్లెక్స్ టాబ్లెట్లు పంపిణీ చేస్తున్నారు. 50 ఏళ్లు పైబడిన వారు అత్యధికంగా కాటరాక్ట్ సమస్యతో బాధపడుతున్నారు. శస్త్ర చికిత్స అవసరమైన వారికి చికిత్స చేసే సమయాన్ని ఫోన్ ద్వారా సమాచారం అందిస్తున్నామని వైద్య సిబ్బంది చెబుతున్నారు.
ఇప్పటికే శస్త్రచికిత్స పూర్తయి ఇతర సమస్యలతో బాధపడుతున్న వారికి వైద్యులు సలహాలు, సూచనలు అందజేస్తున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ముందుచూపుతో అందరికి అభివృద్ధి, సంక్షేమఫలాలు అందించుటకు ప్రభుత్వం చేస్తున్న కృషి మంచి ఫలితాలను ఇస్తున్నది. అదే స్ఫూర్తితో ఆరోగ్య కుటుంబ సంక్షేమ పధకాలు అమలులో ముందున్న రాష్ట్రం ఆరోగ్య తెలంగాణగా రూపుదిద్దుకుంటున్నది.