హైదరాబాద్, మే 31 (నమస్తే తెలంగాణ): గ్రూప్-1 దరఖాస్తుల గడువును జూన్ 4 వరకు పొడిగిస్తున్నట్టు టీఎస్పీఎస్సీ మంగళవారం రాత్రి ప్రకటించింది. వాస్తవానికి మంగళవారం రాత్రితో గడువు ముగిసినప్పటికీ, అభ్యర్థుల నుంచి వచ్చిన విజ్ఞప్తుల మేరకు టీఎస్పీఎస్సీ ఈ నిర్ణయం తీసుకొన్నది. ఫీజుల చెల్లింపు విషయంలో సమస్యలు తలెత్తినట్టు అభ్యర్థుల నుంచి ఫిర్యాదులు రావడంతో ఎవరూ నష్టపోకుండా ఉండాలన్న ఉద్దేశంతో గడువును పొడిగిస్తున్నట్టు టీఎస్పీఎస్పీ వర్గాలు తెలిపాయి. మొత్తం 503 గ్రూప్-1 పోస్టులకు ఇప్పటివరకు 3,48,095 దరఖాస్తులు రాగా, మంగళవారం ఒక్కరోజే దాదాపు 50 వేల మందికి పైగా దరఖాస్తు చేసుకొన్నట్టు సమాచారం. దీంతో ఉమ్మడి రాష్ట్రంలో 2011 నాటి రికార్డును ఇది అధిగమించినట్టయ్యింది. 2011లో 312 గ్రూప్-1 పోస్టులకు నోటిఫికేషన్ వెలువడగా అప్పట్లో 3,02,912 దరఖాస్తులు వచ్చాయి. ఇప్పుడు అంతకంటే ఎక్కువ మంది అభ్యర్థులు దరఖాస్తు చేయడం గమనార్హం. గడువు పొడిగించిన నేపథ్యంలో మరికొందరు అభ్యర్థులు దరఖాస్తు చేసుకొనే అవకాశం ఉన్నది. మంగళవారం నాటికి ఓటీఆర్ నమోదు, ఎడిట్ చేసుకొన్నవారి సంఖ్య 5,58,275కు చేరింది.
గ్రూప్-1 దరఖాస్తులు ఇలా
31 వరకు వచ్చిన దరఖాస్తులు : 3,48,095
మొత్తం పోస్టులు : 503
2011లో వచ్చిన దరఖాస్తులు : 3,02,912