పెద్దపల్లి : నియోజకవర్గంలో రైల్వే సమస్యలు పరిష్కరించాలని దక్షిణ మధ్య రైల్వే జీఎం అరుణ్కుమార్ జైన్కు పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి వినతిపత్రం అందజేశారు. శుక్రవారం రైల్వే జీఎం సికింద్రాబాద్ నుంచి రామగుండం వైపు వెళ్తూ పెద్దపల్లి రైల్వే స్టేషన్ లో ఆగారు. ఈ సందర్భంగా పెద్దపల్లి, పొత్కపల్లి రైల్వే స్టేషన్లలో నెలకొన్న సమస్యలను ఎమ్మెల్యే జీఎంకు వివరించారు.
పెద్దపల్లిలో హైదరాబాద్ నుంచి నాగ్పూర్, నవజీవన్ ఎక్స్ప్రెస్, దక్షన్, కేరళ వంటి రైళ్లను ఆపాలని కోరారు. కరీంనగర్ నుంచి పెద్దపల్లి రైలు మార్గంలో రైల్వే అండర్ బ్రిడ్జిలను, ఆర్యూబీలను వెంటనే విస్తరించాలని కోరారు. పెద్దపల్లి, పొత్కపల్లి రైల్వే స్టేషన్లను ఆధునీకరించి ప్రయాణికులకు మౌలిక సదుపాయాలు, విశ్రాంతి గదులు సౌకర్యాలు మరింత మెరుగు పరచాలన్నారు.
పెద్దపల్లి స్టేషన్లో ఎస్కలేటర్, పొత్కపల్లి లో ఫుట్ ఓవర్ బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలని కోరారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ దాసరి మమతా రెడ్డి, వైస్ చైర్ పర్సన్ నజ్మీన్ సుల్తానా-మోబిన్, పట్టణాధ్యక్షుడు ఉప్పు రాజ్ కుమార్, కౌన్సిలర్ రేవెల్లి స్వామి, సర్పంచులు ఆళ్ల రాజిరెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, శ్రీనివాస్, ఎంపీటీసీ మల్లేశం, రైల్వే అధికారులు, తదితరులు పాల్గొన్నారు.