Kaleshwaram | హైదరాబాద్, అక్టోబర్ 24 (నమస్తే తెలంగాణ): మేడిగడ్డ బరాజ్లోని పిల్లర్ కుంగుబాటు వల్ల కాళేశ్వరం ఆయకట్టుకు ఎలాంటి ఢోకా లేదని, యథావిధిగా సాగునీటిని అందించే అవకాశమున్నదని ఇరిగేషన్శాఖ ఉన్నతాధికారులు చెప్తున్నారు. ఇప్పటికే ప్రాజెక్టు పరిధిలోని అన్ని రిజర్వాయర్లలో ఆయకట్టుకు కావాల్సిన నీరు అందుబాటులో ఉన్నది. అవసరమైతే మేడిగడ్డ నుంచి కూడా పంపింగ్ చేసుకునే అవకాశమున్నదని, అందుకు ఎలాంటి ఇబ్బందులు లేవని వివరిస్తున్నారు. మేడిగడ్డ వద్ద లక్ష్మీబరాజ్కు సంబంధించి 7వ బ్లాక్లోని 20వ పిల్లర్ కుంగుబాటుకు గురైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ముందస్తు జాగ్రత్త చర్యగా బరాజ్లోని నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. దీనిపై పలువురు, పలు రకాలుగా ప్రచారం చేస్తూ.. ఆయకట్టుకు నీరందని పరిస్థితి నెలకొందని వదంతులను వ్యాపింప జేస్తున్నారు. దీనిపై పలువురు ఇరిగేషన్ ఉన్నతాధికారులను సంప్రదించగా మేడిగడ్డ బరాజ్ సంఘటనతో కాళేశ్వరం ఆయకట్టుకు ఎలాంటి ఢోకా లేదని వారు తేల్చిచెప్పారు.
మేడిగడ్డ బరాజ్ నుంచి గత ఏడాది యాసంగి సీజన్కు 34టీఎంసీల నీటిని మళ్లించారు. రాజరాజేశ్వర జలాశయం, అక్కడి నుంచి ఎగువన ఉన్న అన్నపూర్ణ, రంగనాయకసాగర్, మల్లన్నసాగర్ తద్వారా నిజాంసాగర్, ఇక దిగువన ఎల్ఎండీతోపాటు అక్కడి నుంచి ఎస్సారెస్పీ స్టేజ్-2లో చివరి ఆయకట్టు ప్రాంతమైన సూర్యపేట వరకు సాగునీటిని సరఫరా చేశారు. ప్రస్తుతం మేడిగడ్డలో పరిణామం కారణంగా నీటిని దిగువకు విడుదల చేస్తున్నప్పటికీ కాళేశ్వరం ఆయకట్టుకు ఎలాంటి ఇబ్బంది లేదని ఇరిగేషన్ ఉన్నతాధికారులు భరోసా ఇస్తున్నారు. ఇప్పటికే కాళేశ్వరం ప్రాజెక్టులో కీలకమైన అన్ని రిజర్వాయర్లలో సామర్థ్యం మేరకు నీరు నిల్వ ఉన్నదని, యాసంగి అవసరాలు తీరిపోతాయని అంటున్నారు. మేడిగడ్డ నుంచి కూడా నీటిని మళ్లించేందుకు ఎలాంటి ఇబ్బంది లేదని వారు స్పష్టం చేస్తున్నారు.
పిల్లర్ కుంగిపోయినప్పటికీ లక్ష్మీబరాజ్ నుంచి నీటిని మళ్లించేందుకు అన్నివిధాలుగా అవకాశాలున్నాయని ఇంజినీరింగ్ అధికారులు వెల్లడించారు. మేడిగడ్డ వద్ద సీ లెవల్ 89 మీటర్లని, పంపింగ్ 92 మీటర్ల ఎత్తు నుంచి చేస్తున్నారని.. దాదాపు 3-4మీటర్ల ఎత్తులో నీటిని మెయింటైన్ చేయగలిగితే ఎత్తిపోసుకోవచ్చని, అందుకు ఎలాంటి ఇబ్బంది ఉండదని వివరించారు. ప్రస్తుతం లక్ష్మీబరాజ్ వద్ద 7వ బ్లాక్లోని పిల్లర్లను కవర్ చేస్తూ కాఫర్ డ్యామ్ను నిర్మించే అవకాశముందని, తద్వారా నీటిని నిర్దేశిత ఎత్తు మేరకు నిల్వ చేసుకునే వెసులుబాటు ఉంటుందని తెలిపారు. కాఫర్ డ్యామ్ను నిర్మించి పంపింగ్ చేసుకోవడంతోపాటు, బరాజ్ పునరుద్ధరణ పనులను కూడా చేపట్టేందుకు ఎల్అండ్టీతో కలిసి ఇప్పటికే ప్రణాళికలను రూపొందిస్తున్నామని తెలిపారు. వీలైనంత త్వరగా పునరుద్ధరణ పనులు పూర్తిచేస్తామని, అదేసమయంలో ఈ సీజన్కు సంబంధించి సాగునీటిని కూడా అందిస్తామని ఇరిగేషన్ అధికారులు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు.