హైదరాబాద్, సెప్టెంబర్ 25 (నమస్తే తెలంగాణ): కొట్లాడి సాధించుకున్న స్వరాష్ట్రంలో ప్రజలకు సకల సదుపాయాలు సమకూర్చేందుకు తెలంగాణ ప్రభుత్వం ఆయా రంగాల కోసం వేల కోట్ల రూపాయలను ఖర్చుచేసింది. వీటిలో ప్రధానమైనది విద్యుత్తురంగం. రాష్ట్రం ఏర్పడే నాటికి హైదరాబాద్ నుంచి గ్రామాల వరకు గంటల తరబడి విద్యుత్తు కోతలు విధిస్తున్న పరిస్థితి. సరైన కరెంట్ సదుపాయం లేక అప్పటికే ఎన్నో పరిశ్రమలు మూతపడ్డాయి. కరెంట్ కోసం పారిశ్రామికవేత్తలు ధర్నాలు చేసిన పరిస్థితి. కానీ రాష్ట్రం ఏర్పడిన ఆరు నెలల్లోనే పరిస్థితులు సంపూర్తిగా మారిపోయాయి. గృహ, వాణిజ్య, పరిశ్రమల రంగాలకు 24 గంటలూ నాణ్యమైన విద్యుత్తును అందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకొన్నది. 2018 జనవరి ఒకటి నుంచి వ్యవసాయానికి కూడా 24 గంటలూ నిరంతరాయంగా ఉచిత విద్యుత్తును అందిస్తున్నది. ఇప్పుడు అన్ని రంగాలకు నిరంతరాయంగా విద్యుత్తు సరఫరా అవుతున్నది. గత ఏడేండ్లలో విద్యుత్తు రంగాన్ని పటిష్ఠపరిచేందుకు ప్రభుత్వం రూ.32,705 కోట్లు ఖర్చు చేసింది. విద్యుత్ సరఫరా, పంపిణీ వ్యవస్థలను బలోపేతంచేసింది. అనేక ప్రాంతాలలో కొత్తగా లైన్లువేసి, ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటుచేసి, సబ్స్టేషన్లు నిర్మించింది. మరోవైపు వ్యవసాయానికి ఉచిత విద్యుత్తునందించేందుకు 25,467 కోట్ల సబ్సిడీ భారాన్ని కూడా మోసింది. వ్యవసాయానికే కాకుండా క్షౌరశాలలకు, దోభీఘాట్లకు కూడా ఉచితంగా విద్యుత్తునందిస్తున్నది. గృహ వినియోగదారులకు స్లాబ్లలో రాయితీలు ఇస్తున్నది. రాష్ట్రంలో సకల జనులు సమానంగా అభివృద్ధి చెందేందుకు ఇంకా పలు వర్గాలకు విద్యుత్తు బిల్లులలో రాయితీలు కల్పిస్తున్నది. ఈ రాయితీల భారం మరో రూ.10 వేల కోట్లకు పైగా ఉన్నది. రాష్ట్రం ఏర్పడేనాటికి ఔట్సోర్సింగ్ సిబ్బందిగా ఉన్న సుమారు 24 వేల మందిని రెగ్యులరైజ్ చేసి, వారి జీతభత్యాలను గణనీయంగా పెంచింది. విద్యుత్తు సంస్థలను బలోపేతంచేయడం కోసం తెచ్చిన రుణాలపై వడ్డీల భారం పెరుగుతున్నది. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన అనంతరం గత ఏడేండ్లలో ఒక్కసారి కూడా విద్యుత్తు చార్జీలను ప్రభుత్వం పెంచలేదు. విద్యుత్తు సంస్థల నుంచి వచ్చే ఆదాయం పెరుగకపోగా, వాటి నిర్వహణ, వివిధ వర్గాలకు కల్పిస్తున్న రాయితీలు ప్రభుత్వానికి పెనుభారంగా పరిణమిస్తున్నాయి. రాష్ర్టానికి న్యాయంగా దక్కాల్సిన పన్ను వాటానే ఇచ్చేందుకు నిరాకరిస్తున్న కేంద్రం.. విద్యుత్తు రంగానికి నయా పైసా కూడా విదిల్చడం లేదు. ఈ నేపథ్యంలో.. రాష్ట్రంలోని అన్ని వర్గాలకు 24 గంటలూ నాణ్యమైన విద్యుత్తును నిరంతరాయంగా అందిస్తున్న ప్రభుత్వం.. తనపై పడుతున్న అదనపు భారంలో కొంత ప్రజలపై వేయాలన్న యోచనలో ఉన్నట్టు తెలుస్తున్నది. ప్రభుత్వం అమలుచేస్తున్న అన్ని రకాల సంక్షేమ పథకాలకు, అభివృద్ధి పథకాలకు మద్దతుగా నిలుస్తున్న రాష్ట్ర ప్రజలు ఈ విషయంలో కూడా అండగా నిలుస్తారని ఆశిస్తున్నది.