T-Diagnostics | హైదరాబాద్, జూన్ 30 (నమస్తే తెలంగాణ): ప్రభుత్వ దవాఖానకు చికిత్స కోసం వచ్చే రోగులకు ఉచితంగా వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేయాలనే సంకల్పంతో ప్రారంభించిన టీ-డయాగ్నస్టిక్స్ (టీడీ) సేవలు మరింత విస్తరించనున్నాయి. సీఎం కేసీఆర్ ఆదేశం మేరకు శనివారం నుంచి టీ-డయాగ్నస్టిక్స్లో టెస్టుల సంఖ్యను 134కు పెంచనున్నారు. ఇప్పటివరకు టీడీల ద్వారా 57 రకాల పరీక్షలను ఉచితంగా నిర్వహిస్తున్నారు. కొత్తగా అందుబాటులోకి రానున్న టెస్టుల్లో ప్రైవేట్ ల్యాబుల్లో రూ.500 నుంచి రూ.10 వేల వరకు ఖరీదు చేసే పరీక్షలు ఉన్నాయి. ఉదాహరణకు ఇమ్యునోహిస్టోకెమిస్ట్రీ పరీక్షకు ప్రైవేట్ ల్యాబుల్లో సుమారు రూ.10 వేల వరకు వసూలు చేస్తారు. వీటితోపాటు తలసేమియా, హీమోఫీలియా, అనీమియా, కాలా అజార్ వంటి వ్యాధులను గుర్తించే ప్రొఫైల్స్, హెచ్ఐవీ టెస్ట్, వైరల్లోడ్ టెస్టులు వంటివి అందుబాటులోకి రానున్నాయి. దీంతోపాటు మరో 8 జిల్లాల్లో కొత్తగా ఏర్పాటు చేసిన పాథాలజీ ల్యాబులు, 16 జిల్లాల్లో నెలకొల్పిన రేడియాలజీ ల్యాబులు ప్రజలకు అందుబాటులోకి రానున్నాయి. ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి హరీశ్రావు వీటిని శనివారం ప్రారంభించనున్నారు. రంగారెడ్డి జిల్లా కొండాపూర్లోని ఏరియా దవాఖాన నుంచి వర్చువల్గా వీటిని ప్రారంభిస్తారు.
10 కోట్లకుపైగా టెస్టులు
ప్రభుత్వ దవాఖానపై నమ్మకంతో వచ్చే రోగులకు ఒక్క రూపాయి కూడా అదనంగా ఖర్చు కావొద్దని సీఎం కేసీఆర్ సంకల్పించారు. ఈ మేరకు టీ-డయాగ్నోస్టిక్స్కు రూపకల్పన చేశారు. 2018 జనవరిలో టీడీ సేవలను ప్రభుత్వం ప్రారంభించింది. హబ్ అండ్ స్పోక్ విధానంలో రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ప్రజలకు అందుబాటులోకి తెచ్చింది. పీహెచ్సీ నుంచి అన్నిస్థాయిల దవాఖానల్లో ఉచిత పరీక్షలు ప్రారంభమయ్యాయి. ఇందులో 57 రకాల పాథాలజీ పరీక్షలతోపాటు (రక్త, మూత్ర పరీక్షలు), ఉచితంగా ఎక్స్రే, యూసీజీ, ఈసీజీ, 2డీ ఈకో, మామ్మోగ్రామ్ వంటి రేడియాలజీ పరీక్షలు అందుబాటులోకి వచ్చాయి.
దీంతో అనేక ప్రయోజనాలు కలిగాయి.
జిల్లాకు ఒక రేడియాలజీ హబ్
రేడియాలజీ పరీక్షలు మరింత నాణ్యంగా, వేగంగా నిర్వహించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ప్రతి జిల్లా కేంద్రంలో ఒక రేడియాలజీ హబ్ను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. 32 రేడియాలజీ హబ్ల ఏర్పాటుకు గతేడాది అనుమతి ఇచ్చింది. ఇందులో ఇప్పటివరకు 13 హబ్ల పనులు పూర్తయ్యాయి. హైదరాబాద్తోపాటు ప్రస్తుతం 19 జిల్లా కేంద్రాల్లో హబ్లు ఉన్నాయి. మిగతా 13 జిల్లాల్లో హబ్ల ఏర్పాటుకు ప్రభుత్వం నిరుడు అనుమతి ఇచ్చింది. వీటిలో 8 హబ్ల పనులు పూర్తయ్యాయి. ఇవి శనివారం నుంచి అందుబాటులోకి రానున్నాయి.
ఏర్పాటుకు రూ.6 కోట్లు.. నిర్వహణకు రూ.3 కోట్లు
ఒక్కో రేడియాలజీ, పాథాలజీ హబ్ ఏర్పాటుకు ప్రభుత్వం ఇప్పటివరకు రూ.4.39 కోట్లు ఖర్చు చేస్తున్నది. 134 పరీక్షలు నిర్వహించేందుకు మరో రూ.1.70 కోట్లు వెచ్చిస్తున్నది. అంటే ఒక్కో హబ్ ఏర్పాటుకు రూ.6.09 కోట్ల వ్యయం కానున్నది. గతంలో ల్యాబుల నిర్వహణకు ఏటా రూ.2.40 కోట్లు ఖర్చు కాగా.. ఇప్పుడు అదనంగా మరో రూ.60 లక్షల భారం పడనున్నది. మొత్తంగా ప్రభుత్వం ఏటా రూ.3 కోట్లు వెచ్చించనున్నది.
13 జిల్లాల్లో రేడియాలజీ హబ్లు
10 కోట్లకుపైగా టెస్టుల నిర్వహణ
రోగుల సంఖ్య – 57,68,523
నమూనాలు – 1,11,49,991
ప్రొఫైల్స్ – 2,07,91,200
పరీక్షలు – 10,40,36,082
మరో 8 జిల్లాల్లో పాథాలజీ హబ్లు
రంగారెడ్డి (కొండాపూర్), సూర్యాపేట, వనపర్తి,
వరంగల్ (నర్సంపేట), యాదాద్రి భువనగిరి,
కామారెడ్డి, పెద్దపల్లి, మంచిర్యాల