హైదరాబాద్, జూన్ 3 (నమస్తే తెలంగాణ) : దేశవ్యాప్తంగా మౌలిక వసతుల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకున్నది. తెలంగాణ, ఒడిశా, బీహార్ రాష్ర్టాల్లో జాతీయ రహదారుల విస్తరణతోపాటు కొత్త రహదారుల నిర్మాణానికి కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది. ఇందులో భాగంగా తెలంగాణలోని ఆర్మూర్-జగిత్యాల-మంచిర్యాల జాతీయ రహదారి(ఎన్హెచ్-63) విస్తరణకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ ప్రాజెక్టును హైబ్రిడ్ యాన్యుటీ మోడల్ విధానంలో చేపట్టేందుకు అంగీకారం తెలిపింది.
జగిత్యాల-కరీంనగర్ జాతీయ రహదారి(ఎన్హెచ్-563) విస్తరణకు సైతం కేంద్రం ఆమోదం తెలిపింది. ఈ పనులను బిల్డ్ ఆపరేట్ ట్రాన్స్ఫర్(బీవోటీ-టోల్) పద్ధతిలో విస్తరించనున్నట్టు పేర్కొన్నది. ఈ రెండు జాతీయ రహదారులను కలిపి 190 కిలోమీటర్ల మేర నాలుగు లైన్లుగా విస్తరించనున్నారు. ఇందుకోసం రూ.7,597 కోట్ల వ్యయాన్ని కేంద్రం అంచనా వేసింది. ఈ ప్రాజెక్టులు పూర్తయితే రాష్ట్రంలో రవాణా సౌకర్యాలు మెరుగుపడటంతోపాటు ప్రయాణ సమయం తగ్గి వాణిజ్య కార్యకలాపాలకు కూడా ఊతం లభించే అవకాశం ఉన్నది.