హైదరాబాద్ సిటీబ్యూరో (నమస్తే తెలంగాణ): అనుకున్నది అనుకున్నట్టుగా జరిగితే మరో మూడు రోజుల్లో అద్భుతం చూడబోతున్నామంటున్నారు ప్లానెటరీ సొసైటీ ఆఫ్ ఇండియా డైరెక్టర్ ఎన్. శ్రీ రఘునందన్ కుమార్. ఈ నెల 23న విక్రమ్ ల్యాండర్ జాబిల్లి దక్షిణ భాగంపై కాలు మోపబోతోందని ఆయన చెప్పారు. జాబిల్లిని ఒక బేస్ స్టేషన్గా మార్చుకుని అక్కడ నుంచి సుదూర అంతరిక్షంలోకి ప్రయాణం చేయడమే లక్ష్యంగా ఈ పరిశోధన సాగబోతుందని పేర్కొన్నారు. చంద్రయాన్-3కి సంబంధించిన అనేక విషయాలను ‘నమస్తే తెలంగాణ’తో ఆయన పంచుకున్నారు.
ఈనెల 23న సాయంత్రం 5:47 గంటలకు ల్యాండర్ చంద్రుడిపై దిగాల్సి ఉంటుంది. అయితే ఈ మొత్తం మిషన్లో చివరి 15 నిమిషాలను విశ్లేషకులు టెర్రర్ టైంగా భావిస్తున్నారు. చంద్రయాన్-2 సమయంలో జాబిల్లి ఉపరితలానికి సరిగ్గా 2 కి.మీ దూరంలో ఉండగా విక్రమ్ ల్యాండర్ కమ్యూనికేషన్ కోల్పోయి క్రాష్ ల్యాండ్ అయింది. అందుకే చంద్రయాన్-3 సాఫ్ట్ ల్యాండింగ్ విషయంలో ఇస్రో అన్ని జాగ్రత్తలు తీసుకున్నది.
చంద్రయాన్-3 చంద్రుడి దక్షిణ ధ్రువానికి 630 కి.మీ దూరంలో దిగుతుంది. చంద్రయాన్-3 ల్యాండింగ్ సైట్ నుంచి 120 కి.మీ దూరంలో రష్యా ప్రయోగించిన లూనా-25 దిగే అవకాశం ఉంది.
భవిష్యత్తులో చంద్ర మండలంపై బేస్ స్టేషన్లు ఏర్పాటు చేసుకునేందుకు దక్షిణ ధ్రువం అనుకూలంగా ఉంది. జాబిల్లిపై ఎప్పటికప్పుడు పరిస్థితులు మారుతుంటాయి. అక్కడ పూర్తి స్థాయిలో నివాసం ఉండటం సాధ్యం కాదు. చంద్రుడి కంటే అంగారకుడు మానవాళి ఆవాసానికి అనుకూలం.
చంద్రయాన్ ప్రయోగాలను పాఠ్యాంశాల్లో చేర్చాలి. ‘టు ద మూన్ బీహైండ్’ కార్యక్రమం ద్వారా విద్యార్థులకు గురించి అవగాహన కల్పిస్తున్నాం. ఆసక్తి ఉన్న విద్యాసంస్థలు 7993482012 వాట్సాప్ నెంబర్ను సంప్రదించవచ్చు.