హైదరాబాద్, డిసెంబర్ 1 (నమస్తే తెలంగాణ): ‘ఒక్క చాన్స్.. ఒకే ఒక్క చాన్స్..’ తెలుగు సినిమాలో ఎంతో ఫేమస్ డైలాగ్ ఇది. పోలీస్ కొలువు కలలుకంటున్న లక్షల మంది యువత ఆ ఒక్క చాన్స్లోనే తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. పెద్దసంఖ్యలో భర్తీ కానున్న ఎస్సై, కానిస్టేబుల్ కొలువులకు ఈ నెల ఎనిమిది నుంచి దేహదారుఢ్య పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ సారి వివిధ విభాగాల్లోని ఎస్సై, కానిస్టేబుల్ ఉద్యోగాలన్నింటికీ దేహదారుఢ్య పరీక్షలు ఒకేసారి నిర్వహించనున్నట్టు తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీస్ నియామక మండలి (టీఎస్ఎల్పీఆర్బీ) ఇప్పటికే ప్రకటించింది. ఒకే అభ్యర్థి ఎన్ని పోస్టులకు పోటీపడుతున్నా.. ఒకసారి తీసిన రీడింగ్స్నే అన్ని పోస్టులకు వర్తింపజేయనున్నారు. దీంతో ఏమాత్రం తేడా వచ్చినా.. పోలీస్ కొలువు చేజారే ప్రమాదం ఉన్నది. అందుకే అభ్యర్థులు ఆందోళన చెందకుండా, పూర్తి సన్నద్ధత, ఏకాగ్రతతో ఈవెంట్స్లో పాల్గొంటే విజయం సాధించవచ్చని ఫిజికల్ ట్రైనర్లు, మానసిక వైద్య నిపుణులు చెప్తున్నారు.
పూర్తిస్థాయిలో టీఎస్ఎల్పీఆర్బీ సన్నద్ధం
హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ, వరంగల్, కరీంనగర్, ఖమ్మం, మహబూబ్నగర్, నల్లగొండ, సంగారెడ్డి, ఆదిలాబాద్, నిజామాబాద్తోపాటు ప్రయోగాత్మకంగా సిద్దిపేటల్లోనూ ఈ సారి దేహదారుఢ్య పరీక్షలు నిర్వహించేందుకు టీఎస్ఎల్పీఆర్బీ అధికారులు ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే ఫిజికల్ ఈవెంట్స్ నిర్వహణకు అవసరమైన బయోమెట్రిక్ పరికరాలు, డిజిటల్ హైట్ మీటర్లు, సీసీటీవీ కెమెరాలు, ఆర్ఎఫ్ఐడీ (రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్) పరికరాలు సహా ఇతర అన్ని సాంకేతిక సామగ్రిని ఫిజికల్ ఈవెంట్స్ నిర్వహణ కేంద్రాలకు తరలించింది. ముందుగానే ఆయా కేంద్రాల్లో ఆ పరికరాల పనితీరును పరిశీలించనున్నారు.
ఫిజికల్ ఈవెంట్స్ నిర్వహణ ఇలా