హనుమకొండ, ఏప్రిల్ 16: హనుమకొండ జిల్లా వేలేరు మండలం పీచర గ్రామానికి చెందిన పిట్టల సుధాకర్ మరణించినందున అతడి కుటుంబానికి రైతుబీమా వర్తించేలా చర్యలు చేపట్టినట్టు వ్యవసాయ శాఖ అధికారులు తెలిపారు. ‘పంటలకు దూరమై.. అప్పులు భారమై’ అనే శీర్షికన ఈ నెల 15న ‘నమస్తే తెలంగాణ’లో ప్రచురితమైన కథనానికి జిల్లా వ్యవసాయ శాఖ అధికారులు స్పందించారు.
సుధాకర్ పేరిట ఉన్న 3.20 ఎకరాల భూమికి సంబంధించి వ్యవసాయ శాఖ ద్వారా రైతుబీమా, రైతుబంధు కోసం దరఖాస్తు చేసుకున్నారని వ్యవసాయ శాఖ అధికారి రవీందర్సింగ్ తెలిపారు. 2023 వానకాలం, యాసంగికి సంబంధించి రైతుబంధు వర్తింపజేశామని ఆయన పేర్కొన్నారు. సుధాకర్ భార్య విజయను రైతుబీమాకే నామినీగా నమోదుచేసినట్టు చెప్పారు. పరిహారం కోసం ఫైల్ను ఎల్ఐసీకి పంపించినట్టు తెలిపారు.