హైదరాబాద్, మే 7 (నమస్తే తెలంగాణ) : హైదరాబాద్ నగరంలో మహిళలకు రక్షణ లేదని మల్కాజిగిరి పోలీస్ కమిషనర్ బీ సుమతి రెండు రోజుల కిందట జరిపిన స్టింగ్ ఆపరేషన్తో బయటపడింది. కాంగ్రెస్ పాలనలో మహిళలు రాత్రిపూట ఒంటరిగా బయటకు వెళ్లే పరిస్థితి లేదని తేలిపోయింది. ఈ విషయం వెలుగుచూడటంతో నగరమంతా భయాందోళనకు గురైంది. రాష్ట్ర ప్రజలంతా ఉలిక్కిపడ్డారు. తాజాగా మరో ఆందోళనకర విషయం బయటికొచ్చింది. రాజధాని నగరం నిషేధిత డ్రగ్స్కు అడ్డాగా మారిందని, ఎన్డీపీ మద్యం ఏరులై పారుతున్నదని స్వయంగా రెవెన్యూ శాఖ కార్యదర్శి రఘునందన్రావు ఆందోళన వ్యక్తంచేశారు. గురువారం ఆయన ఆబారీ భవన్లో ఎక్సైజ్ కమిషనర్ సీ హరికిరణ్తో కలిసి సమీక్ష నిర్వహించారు. అన్ని జిల్లాల ఎక్సైజ్ డీసీలు, ఈఎస్లు, ఇతర అధికారులతో నిర్వహించిన సమీక్షలో 2025 సంవత్సరంతోపాటు ఈ ఏడాది ఏప్రిల్ మాసం వరకు ఎక్సైజ్ శాఖ పనితీరుపై చర్చించారు.
ఎక్సైజ్ అధికారులు క్రైమ్ కంట్రోల్పై ప్రధానంగా దృష్టి పెట్టి పనిచేయాలని రెవెన్యూ శాఖ కార్యదర్శి రఘునందన్రావు సూచించారు. డ్రగ్స్, గంజాయి, అక్రమ మద్యం రవాణాను అరికట్టే విధంగా పనిచేయాలని ఆదేశించారు. ఇకపై ప్రతి 3 నెలలకోసారి జిల్లా, డివిజన్ స్థాయిల్లో పనితీరుపై సమీక్షించి, ర్యాంకులు ఇస్తామని వెల్లడించారు. అధికారుల పనితీరు బాగుంటే ఫలితాలు బాగుంటాయని చెప్పారు. వృత్తి నైపుణ్యాలు పెంచుకుంటేనే శాఖ పనిచేసే విధానం మెరుగుపడుతుందని తెలిపారు. అక్రమ మద్యం, డ్రగ్ సరఫరా కేసులపై ఎక్సైజ్ నివేదికలు పరిశీలించిన ఆయన విస్మయం వ్యక్తంచేసినట్టు తెలిసింది. పంజాబ్, ఢిల్లీ, హర్యానా, చండీగఢ్ తదితర రాష్ర్టాల నుంచి హైదరాబాద్కు అక్రమంగా మద్యం రవాణా జరుగుతున్నదని, ఇది ఎక్సైజ్ ఆదాయాన్ని భారీగా దెబ్బతీస్తున్నదని ఆందోళన వ్యక్తంచేశారని సమాచారం. పట్టణాలు, నగరాలతోపాటు గ్రామాల్లో కూడా డ్రగ్ కల్చర్ వేగంగా విస్తరిస్తున్నదని హెచ్చరించినట్టు తెలిసింది. ఈ ఎక్సైజ్ క్రైమ్ను ఎందుకు నియంత్రించలేకపోతున్నామో అధికారులు అధ్యయనం చేయాలని సూచించినట్టు విశ్వసనీయంగా తెలిసింది. సమావేశంలో అడిషనల్ కమిషనర్ సయ్యద్ యాసిన్ ఖురేషీ, ఎక్సైజ్ అకాడమీ డైరెక్టర్ సురేశ్ రాథోడ్, జాయింట్ కమిషనర్లు అంజన్రావు (ఎన్ఫోర్స్మెంట్), డేవిడ్ రవికాంత్ (హెడ్క్వార్టర్స్), రంగారెడ్డి, హైదరాబాద్, మెదక్, ఖమ్మం నల్లగొండ, ఆదిలాబాద్, మహబూబ్నగర్ డిప్యూటీ కమిషనర్లు పీ దశరథ్, అనిల్కుమార్రెడ్డి, జే హరికిషన్, జనార్దన్రెడ్డి, శ్రీనివాసరెడ్డి, రఘురామ్, విజయభాసర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో హైదరాబాద్ ప్రపంచంలోనే అత్యంత సురక్షిత నగరాల్లో ఒకటిగా గుర్తింపు పొందింది. దీంతో ఐటీ, ఫార్మా రంగాల్లో పెట్టుబడులు పెరిగాయి. ఫలితంగా యువత యథేచ్ఛగా నగరం బాటపట్టింది. ఈ రెండున్నరేండ్ల కాంగ్రెస్ పాలనతో పరిస్థితి మొత్తం తారుమారైంది. బుధవారం రాత్రి మల్కాజిగిరి సీపీ బీ సుమతి చేపట్టిన స్టింగ్ ఆపరేషన్, గురువారం రెవెన్యూ కార్యదర్శి రఘునందన్రావు నిర్వహించిన సమావేశంలో పేర్కొన్న అంశాలను బట్టి హైదరాబాద్ నగరం సురక్షితం కాదన్న చర్చ జరుగుతున్నది. హైదరాబాద్తోపాటు తెలంగాణ రాష్ట్రమంతటా శాంతిభద్రతలు ప్రమాదంలో ఉన్నాయనే కఠోర వాస్తవాన్ని బయటపెట్టినట్టు అయిందని ప్రతిపక్ష పార్టీలు ఆరోపిస్తున్నాయి. నైట్ కల్చర్ను విస్తరించాలనే ఉద్దేశంతో ప్రభుత్వ పెద్దలు శాంతిభద్రతలను గాలికొదిలేశారని, అందుకే పరిస్థితి అదుపు చేయలేని స్థాయికి చేరిపోయిందని ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.