మహబూబ్నగర్ అర్బన్, నవంబర్ 4: దొంగ సర్వేల పేరిట కాంగ్రెస్ నేతలు మోసానికి పాల్పడుతున్నారని ఎక్సైజ్, క్రీడా శాఖల మంత్రి శ్రీనివాస్గౌడ్ ధ్వజమెత్తారు. శనివారం మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో మాజీ మంత్రి పీ చంద్రశేఖర్, మైనార్టీ నాయకుడు సయ్యద్ ఇబ్రహీంతో కలిసి మంత్రి మీడియాతో మాట్లాడారు. పొరపాటున కాంగ్రెస్కు ఓటేస్తే.. తెలంగాణ పరిశ్రమలన్నింటినీ కర్ణాటకకు తరలిస్తారని హెచ్చరించారు. హైదరాబాద్లో నెలకొల్పనున్న ఐఫోన్ పరిశ్రమను తరలించేందుకు కర్ణాటక ప్రభుత్వం కుట్ర చేస్తున్నదని తెలిపారు.
రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా మహబూబ్నగర్లో నీచులు, దౌర్భాగ్యులు ఉన్నారని, వారితో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అనంతరం సయ్యద్ ఇబ్రహీం మాట్లాడుతూ.. కాంగ్రెస్ నాయకులు బీసీలకు ఇవ్వాల్సిన టికెట్లను అమ్ముకొని.. బడుగు, బలహీన వర్గాలకు తీవ్ర అన్యాయం చేశారని దుయ్యబట్టారు. మాజీ మంత్రి చంద్రశేఖర్ మాట్లాడుతూ.. బీజేపీలో డబ్బులు ఉన్న వారిని మాత్రమే పలుకరిస్తారని, బీసీలను సీఎం చేస్తామని చెప్తున్న బీజెపీ నేతలు.. బీసీ అభ్యర్థులకు మాత్రం టికెట్లు కేటాయించలేదని విమర్శించారు. బీజేపీ సోషల్ మీడియాకు చెందిన యువకులు 50 మంది మంత్రి శ్రీనివాస్గౌడ్ సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు.