హైదరాబాద్, ఫిబ్రవరి 4 (నమస్తే తెలంగాణ): మద్యం బాటిళ్లపై సిండికేట్ లేబుల్స్ వేసి అమ్మకాలు జరిపితే కఠినమైన చర్యలు తీసుకుంటామని ఎక్సైజ్ కమిషనర్ హరికిరణ్ హెచ్చరించారు. మద్యం వ్యాపారులు సిండికేట్గా మారితే సహించేది లేదని తేల్చిచెప్పారు. ‘సరార్ సీసా.. సిండికేట్ లేబుల్’ శీర్షికతో బుధవారం ‘నమస్తే తెలంగాణ’ పత్రికలో ప్రచురితమైన కథనంపై హరికిరణ్ స్పందించారు.
ఎంఆర్పీ ఉల్లంఘనలపై కొన్ని ఫిర్యాదులు వచ్చాయని, వాటి ఆధారంగా ఎస్టీఎఫ్, ఎన్ఫోర్స్మెంట్ టీమ్లు అదిలాబాద్ జిల్లాలోని కాగజ్నగర్ ప్రాంతంలో గూడెం, బెజ్జూరు, సూర్యాపేటలోని హుజూర్నగర్లో, నల్లగొండ జిల్లాలో హాలియా ప్రాంతాల్లో కేసులు నమోదు చేశారని తెలిపారు. సమయపాలన పాటించని మద్యం షాపులపై ఫిర్యాదులు వస్తే కేసులు నమోదు చేస్తామన్నారు.