హైదరాబాద్, డిసెంబర్ 25 (నమస్తే తెలంగాణ) : జేఈఈ మెయిన్, జేఈఈ అడ్వాన్స్డ్, నీట్, సీయూఈటీ వంటి జాతీయ ప్రవేశ పరీక్షల షెడ్యూళ్లు విడుదలయ్యాయి. ఐఐటీలు, ఎన్ఐటీలు, సెంట్రల్ వర్సిటీలు, మెడికల్ కాలేజీల్లో సీట్ల భర్తీకి ఈ ప్రవేశ పరీక్షలు నిర్వహిస్తారు. ఈ ఏడాది జనవరిలో జేఈఈ మెయిన్ -1 పరీక్ష ఉన్నది. మార్చిలో ఇంటర్ వార్షిక పరీక్షలు ఉండటంతో సింహభాగం ప్రవేశ పరీక్షలు ఏప్రిల్, మే మాసాల్లో జరగనున్నాయి. కరోనా కారణంగా ఇదివరకు విద్యాసంవత్సరం, ప్రవేశాలు ఆలస్యం కాగా, ఈ ఏడాది కాస్త ముందుగానే నోటిఫికేషన్లు విడుదలయ్యాయి. పలు పరీక్షలకు కామన్ క్యాలెండర్ను కూడా నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) విడుదల చేసింది. త్వరలోనే ఎంసెట్ సహా రాష్ట్రస్థాయిలో నిర్వహించే ప్రవేశ పరీక్షల షెడ్యూళ్లు సైతం విడుదల కానున్నాయి. బీఎఫ్ 7 వేరియంట్ వ్యాప్తి నేపథ్యంలో కరోనా పరిస్థితులను అంచనావేసి రాష్ట్రస్థాయి ప్రవేశ పరీక్షల షెడ్యూళ్లను ప్రకటించనున్నారు.
విట్ ఇంజినీరింగ్ ఎంట్రన్స్ ఎగ్జామ్ 2023 ఏప్రిల్ 15 నుంచి 21 మధ్య నిర్వహిస్తారు. దరఖాస్తుల స్వీకరణ గడువు 2023 మార్చి 31తో ముగుస్తుంది.
బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ఇంజినీరింగ్ కోర్సుల్లో ప్రవేశాల పరీక్షను మే/జూన్ మాసాల్లో నిర్వహిస్తారు.
జాతీయంగా ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకోసం జీ ప్యాట్ ఎగ్జామ్ను ఫిబ్రవరిలో నిర్వహిస్తారు. దరఖాస్తుల స్వీకరణ త్వరలోనే ప్రారంభంకానున్నది.
మళ్లీ ఇంటర్ మార్కుల నిబంధన
జేఈఈలో మళ్లీ ఇంటర్ మార్కులను నిబంధనను పునరుద్ధరించారు. కరోనా కారణంగా పలు రాష్ర్టాల బోర్డుల్లో వార్షిక పరీక్షలు జరగకపోవడంతో 2020, 2021 సంవత్సరాల్లో ఈ నిబంధన నుంచి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) మినహాయింపు ఇచ్చింది. కనీస మార్కులతో ఇంటర్ పాసైనా జేఈఈ పరీక్షలకు హాజరయ్యే అవకాశం ఇచ్చింది. తాజాగా మళ్లీ ఇంటర్ మార్కుల నిబంధనను పునరుద్ధరించారు. జనరల్ విద్యార్థులు బోర్డు పరీక్షల్లో( ఫిజిక్స్, కెమిస్ట్రీ, గణితం) 75 శాతం, ఎస్సీ, ఎస్టీ, వికలాంగ విద్యార్థులు కనీసం 65 శాతం మార్కులు సాధిస్తేనే జేఈఈ పరీక్షలు రాసే చాన్స్ ఉన్నది.
ఉన్నత విద్యలో నంబర్ 2
దేశంలో ప్రతి లక్షమంది సగటున కాలేజీల సంఖ్యలో కర్ణాటక తర్వాత తెలంగాణ రెండో స్థానంలో ఉన్నది. కర్ణాకటలో ప్రతి లక్షమందికి 59 కాలేజీలు ఉండగా, తెలంగాణలో 53 ఉన్నాయి. 51 కాలేజీలతో ఆంధ్రప్రదేశ్ మూడోస్థానంలో నిలించింది. నాణ్యమైన విద్యలో జిల్లాలవారీగా చూస్తే 81.66 పాయింట్లతో హైదరాబాద్ ఉత్తమ జిల్లాగా నిలిచింది. ఉన్నత విద్యలో అత్యుత్తమ మౌలిక వసతులు, గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో (జీఈఆర్)లో వరంగల్ జిల్లా టాప్లో నిలిచింది. ప్రాథమిక జ్ఞాన సముపార్జనలో కూడా తెలంగాణ అత్యుత్తమ ప్రగతి సాధించిందని నివేదికలో వెల్లడైంది. ఈ అంశంలో రంగారెడ్డి జిల్లా 62 పాయింట్లతో దేశంలోని టాప్ జిల్లాల్లో ఒకటిగా నిలిచింది. ఇలా అనేక అంశాల్లో గుణాత్మక మార్పుల ద్వారా సామాజిక అభివృద్ధిలో తెలంగాణ దూసుకుపోతున్నదని నివేదికలో కితాబిచ్చారు.