Vinod Kumar | హైదరాబాద్ : ప్రముఖ వ్యవసాయ శాస్త్రవేత్త ఎంఎస్ స్వామినాథన్ మృతి చెందడం పట్ల రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. దేశం ఒక గొప్ప శాస్త్రవేత్తను కోల్పోయిందని వినోద్ కుమార్ అన్నారు. వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చిన ఘనత స్వామినాథన్కే దక్కుతుందన్నారు. జీవిత కాలం మొత్తం రైతుల సంక్షేమం గురించి పరితపించిన మహా వ్యక్తి స్వామినాథన్ అని వినోద్ కుమార్ పేర్కొన్నారు.
వ్యవసాయ రంగంలో అనేక నూతన ఆవిష్కరణలు చేస్తూ అనేక వరి వంగడాలను ప్రపంచానికి అందించిన మహా మేధావి స్వామినాథన్ అని ఆయన కొనియాడారు. దేశం సహా అనేక అంతర్జాతీయ పురస్కారాలు అందుకున్న వ్యక్తి స్వామినాథన్ అని గుర్తు చేశారు. వారి కుటుంబ సభ్యులకు వినోద్ కుమార్ ప్రగాఢ సానుభూతిని ప్రకటించారు.