LPG Cylinder | హైదరాబాద్ : ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ( PM Modi ) నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం( BJP Govt ) ఎల్పీజీ సిలిండర్ ధరలను మరోసారి పెంచడం పట్ల రాష్ట్ర ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్( Vinod Kumar ) ఆందోళన వ్యక్తం చేశారు. ఈశాన్య రాష్ట్రాల ఎన్నికలు ముగియగానే సామాన్యుల నడ్డి విరుస్తూ.. ముఖ్యంగా మహిళలపై ఆర్థిక భారం మోపుతూ ప్రధాని గ్యాస్ సిలిండర్ ధరలను మరోసారి పెంచారని, ఇది అత్యంత విచారకరమని వినోద్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతర్జాతీయంగా క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గుతున్న తరుణంలో భారతదేశంలో మాత్రం మోదీ అనైతికంగా ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ధరలను పెంచారని వినోద్ కుమార్ ఆరోపించారు.
పెంచిన ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ధరలను తక్షణం తగ్గించాలని వినోద్ కుమార్ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ధరలను పెంచడం ద్వారా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రపంచ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలకు చేదు బహుమతిని ఇచ్చారని వినోద్ కుమార్ విమర్శించారు.
2014 సంవత్సరంలో రూ. 410 ఉన్నగ్యాస్ సిలిండర్ ధర ప్రస్తుతం పెంచిన రూ. 50 తో కలిపి రూ.1,155కు చేరుకుందన్నారు. గృహ అవసరాల సిలిండర్ ధరను రూ. 50, వాణిజ్య అవసరాల సిలిండర్ ధరను రూ. 350 పెంచడం దారుణం అని వినోద్ కుమార్ అన్నారు. గ్యాస్ సిలిండర్ ధరలను వెంటనే తగ్గించాలని వినోద్ కుమార్ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.