హైదరాబాద్ : రాజకీయ విశ్లేషకులు, మాజీ ఎమ్మెల్సీ నాగేశ్వర్ కేంద్ర ప్రభుత్వ వివక్షను ఎండగట్టారు. ఖేలో ఇండియాకు కేటాయించిన నిధులపై నాగేశ్వర్ విశ్లేషణ చేశారు. కామన్వెల్త్ క్రీడల్లో అత్యధిక పతకాలు సాధించిన తెలంగాణకేమో నిధులు తక్కువ కేటాయిస్తారు. అసలు పతకాలే తీసుకురాలేని గుజరాత్కేమో దేశంలోనే అత్యధికంగా నిధులు కేటాయించారని ఆయన చెప్పుకొచ్చారు.
కేంద్ర ప్రభుత్వ నిధుల పంపిణీలో ఫెడరల్ స్ఫూర్తి ఏంటంటే.. రాష్ట్రాల పట్ల ఎలాంటి పక్షపాతం చూపెట్టకూడదు. అన్ని రాష్ట్రాలు ఒక్కటే. అది ఏ పార్టీ అధికారంలో ఉందన్న దానితో సంబంధం లేదు. కానీ క్రీడల రంగంలో నిధుల కేటాయింపును చూస్తుంటే ఆశ్చర్యం వేస్తోంది. క్రీడా మంత్రిత్వ శాఖలో గణనీయమైన నిధులు ఖేలో ఇండియాకు ఇచ్చారు. ఖేలో ఇండియా నిధుల కేటాయింపు గురించి ఆగస్టు 2న పార్లమెంట్కు కేంద్ర ప్రభుత్వం లిఖితపూర్వకంగా ఒక సమాధానం రాసి ఇచ్చింది. ఖేలో ఇండియా కింద తెలంగాణకు రూ. 24 కోట్లు కేటాయించారు. కానీ గుజరాత్కు రూ. 608 కోట్లు కేటాయించారు. గుజరాత్కు కేటాయించిన నిధులతో పోల్చితే తెలంగాణకు కేటాయించింది కేవలం 4 శాతం మాత్రమే.
ఇటీవల జరిగిన కామన్వెల్త్ క్రీడలకు గుజరాత్ నుంచి ఎంత మంది వెళ్లారు. అక్కడ్నుంచి ఐదు మంది అథ్లెట్స్ వెళ్లినట్లు ఉన్నారు. కానీ తెలంగాణ నుంచి వెళ్లిన బృందంలో దాదాపు ప్రతి ఒక్కరూ ఏదో ఒక మెడల్ సాధించారు. మరి గుజరాత్ నుంచి వెళ్లిన క్రీడాకారులు ఎన్ని మెడల్స్ తెచ్చారు? నిధులేమో అత్యధికం.. మెడల్స్ సాధించడంలో అతి తక్కువ. మరి ఎందుకని ఇంత భారీ ఎత్తులో గుజరాత్కు నిధులు కేటాయిస్తున్నారు. అది మోదీ, అమిత్ షా స్వరాష్ట్రం అని నిధులు కేటాయిస్తున్నారా? బీజేపీ పాలించని రాష్ట్రాలకు తీవ్ర అన్యాయం జరుగుతుంది.
తెలంగాణకు రూ. 24 కోట్లు, ఏపీకి రూ. 34 కోట్లు, తమిళనాడుకు రూ. 33 కోట్లు, కేరళకు రూ. 62 కోట్లు కేటాయించారు. సౌత్ ఇండియాలో బీజేపీ పాలించని ఈ రాష్ట్రాలకు మొత్తంగా రూ. 154 కోట్లు కేటాయించారు. బీజేపీ పాలిత రాష్ట్రం కర్ణాటకకు రూ. 128 కోట్లు కేటాయించారు. మొత్తం కర్ణాటకతో సహా ఐదు దక్షిణ రాష్ట్రాలను చూస్తే రూ. 280 కోట్లకు పైగా కేటాయించారు.
ఉత్తరాది రాష్ట్రాలైన గుజరాత్కు రూ. 608 కోట్లు, యూపీకి రూ. 500 కోట్లకు పైగా కేటాయించారు. ఒక్క గుజరాత్కే అన్ని నిధులు ఎందుకుకేటాయించారో సమాధానం లేదు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రం రాజస్థాన్కు రూ. 110 కోట్లు, మహారాష్ట్రకు రూ. 111 కోట్లు కేటాయించారు. మొత్తంగా చూసుకున్నప్పుడు బీజేపీ పాలిత రాష్ట్రాలకు పెద్దపీట, అందులో మోదీ, అమిత్ షా స్వరాష్ట్రానికి ఇంకా పెద్దపీట వేశారు. రెండో అంశం ఏంటంటే నార్త్ ఇండియన్ స్టేట్స్కు ఒక రకమైన నిధులు కేటాయిస్తే, సౌత్ ఇండియన్ స్టేట్స్కు మరో రకంగా నిధులు కేటాయించారు. నిధుల కేటాయింపులో వివక్షత చూపిస్తే దేశ సమైక్యత, సమ్రగతకు ప్రమాదం కలుగుతుందని నాగేశ్వర్ పేర్కొన్నారు.