సంతాపం తెలిపిన సీఎం కేసీఆర్
మణుగూరు రూరల్, ఏప్రిల్ 24: మాజీ ఎమ్మెల్యే కుంజా భిక్షం(85) కన్నుమూశారు. అనారోగ్యంతో హైదరాబాద్లోని ఓ దవాఖానలో చికిత్స పొందుతున్న ఆయన శనివారం తుదిశ్వాస విడిచారు. ఆయన స్వగ్రామం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలంలోని పగిడేరు. బూర్గంపహాడ్ (పాత) నియోజకవర్గం నుంచి సీపీఐ తరఫున 1989, 1994లో రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. భిక్షం కరెంట్ సౌకర్యం లేని గిరిజన గ్రామాలను చూసి బాధపడ్డారు. అప్పటి రాష్ట్ర నాయకుల సహకారంతో ఏకంగా 365 గ్రామాలకు విద్యుత్తు సౌకర్యం కల్పించి అందరి మనసుల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు. పినపాక మండలం నుంచి కొత్తగూడెం వరకు ఉన్న సుమారు 200 గ్రామాల్లో రోడ్లు వేయించారు. 1994 తరువాత కాంగ్రెస్లో చేరారు. ఆ తర్వాత టీఆర్ఎస్ పార్టీ సభ్యత్వం తీసుకున్నారు. ఆదివారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం మిట్టగూడెంలో అంత్యక్రియలు నిర్వహించనున్నట్టు కుటుంబ సభ్యులు తెలిపారు.
సీఎం కేసీఆర్ సంతాపం
హైదరారాబాద్, నమస్తే తెలంగాణ: మాజీ ఎమ్మెల్యే కుంజ భిక్షం మృతి పట్ల ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు సంతాపం ప్రకటించారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.