ఖైరతాబాద్, ఫిబ్రవరి 7: మాజీ మంత్రి, సినీ నటుడు బాబుమోహన్ బీజేపీకి గుడ్బై చెప్పారు. రాజీనామా లేఖను పార్టీ అధిష్ఠానానికి పంపుతున్నట్టు వెల్లడించారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన ఆందోల్ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. వరంగల్ ఎంపీ టికెట్ ఆశించగా, అధిష్ఠానం ఒప్పుకోలేదు. ఈ నేపథ్యంలో ఆయన పార్టీని వీడుతున్నట్టు ప్రకటించారు. బుధవారం ఆయన సోమాజిగూడ ప్రెస్క్లబ్లో మీడియాతో మాట్లాడుతూ.. కేంద్రమంత్రి కిషన్రెడ్డి, ఎంపీ లక్ష్మణ్ వైఖరి కారణంగానే తాను పార్టీని వీడుతున్నట్టు ప్రకటించారు. ‘ఆ నేతకు మూడు పదవులెందుకు.. గాడిదలు కాయడానికా?’ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. పార్టీలో వ్య వహారం అస్తవ్యస్తంగా ఉన్నదని, కొందరు పెద్దలు తనకు వ్యతిరేకంగా గ్రూపులు తయారుచేసి, విమర్శలు, ట్రోల్ చేయిస్తున్నారని మండిపడ్డారు. వరంగల్ జిల్లాలో పుట్టిన తనకు అక్కడి ప్రజలతో విడదీయరాని బంధం ఉన్నదని, అవసరమైతే వరంగల్ నుంచి ఇండిపెండెంట్గా పోటీ చేస్తానని స్పష్టం చేశారు.