Srinivas Goud | హైదరాబాద్ : జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమి భయంతో దిగజారి నీతిమాలిన రాజకీయాలు చేస్తోంది అని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ధ్వజమెత్తారు. కాంగ్రెస్ అభ్యర్ధి నాతో ఎప్పుడు ఫోటో దిగారో, ఎప్పుడు మాట్లాడారో తనకు తెలియదన్నారు. నా జీవితాంతం కేసీఆర్తోనే ఉంటానని శ్రీనివాస్ గౌడ్ స్పష్టం చేశారు. తెలంగాణ భవన్లో శ్రీనివాస్ గౌడ్ మీడియాతో మాట్లాడారు.
నవీన్ యాదవ్కు శ్రీనివాస్ గౌడ్ మద్దతు తెలిపారని సోషల్ మీడియాలో ఫేక్ పోస్టులు పెడుతున్నారు. ఫాల్త్ మాటలతో కాంగ్రెస్
అధికారంలోకి వచ్చింది. నేను ఉద్యమ సమయం నుంచి కేసీఆర్తో ఉన్నాను. నా తండ్రి తెలంగాణ ఉద్యమకారుడు. తెలంగాణ కోసం ఉద్యోగాన్ని వదులుకుని వచ్చాను. ఉద్యోగంలో ఉండి జైలుకి వెళ్ళాను. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే నా తమ్ముడిని 40 రోజులు జైల్లో పెట్టారు. నేను ఒకే పార్టీలో ఉన్నాను, ఎమ్మెల్యేగా, మంత్రిగా పనిచేశాను. నా క్యారెక్టర్ను దెబ్బతీస్తున్నారు. గెలవడం చేతకాక క్యారెక్టర్ దెబ్బతీస్తున్నారు అని శ్రీనివాస్ గౌడ్ మండిపడ్డారు.
ఫేక్ ప్రచారాలు చేస్తున్న వారిపై మేము అధికారంలోకి వచ్చిన తర్వాత కచ్చితంగా చర్యలు తీసుకుంటాము. నాపై సోషల్ మీడియాలో అసత్య ప్రచారం చేస్తున్న వారిపై సైబర్ క్రైమ్లో ఫిర్యాదు చేస్తాం. వారిపై రూ. 10 కోట్లకు పరువు నష్టం దావా వేస్తాం. ఏ బుక్ లేదన్న డీజీపీ ఎందుకు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్న వారిపై చర్యలు తీసుకోవడం లేదు. కాంగ్రెస్ వాళ్ళను మాత్రమే డీజీపీ కాపాడుతారా..? అని శ్రీనివాస్ గౌడ్ నిలదీశారు.
సెటిల్మెంట్లు చేసిన వాళ్ళను, రేప్ కేసులో ఉన్న వాళ్ళను వెంట తిప్పుకోవడం కాంగ్రెస్ నేతలకు అలవాటు. కేసీఆర్ చేసినట్లు బీసీలకు ఎవరూ మేలు చేయలేదు. మీలాగా మేము చెట్టు కొమ్మను నరుక్కోం. కాంగ్రెస్ అఫీషియల్ ఫేస్బుక్లో నాపై పోస్టు పెట్టారు మీకు సిగ్గు ఉందా..? ఎంతో కష్టపడి ఈ స్థాయికి వచ్చాను జీవితాలతో ఆటలు ఆడవద్దు. మా కుటుంబ సభ్యులను
వేధించినా మేము భయపడలేదు. పార్టీ మారితే కేసులు ఎత్తివేస్తామన్నా పార్టీ మారలేదు అని శ్రీనివాస్ గౌడ్ తెలిపారు.