Niranjan Reddy | ఇది ప్రజా పాలన కాదు .. పడకేసిన పాలన అని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి విమర్శించారు. రుణానికి ‘మాఫీ’ లేదు.. రైతుకు ‘భరోసా’ లేదు అని అన్నారు. రుణమాఫీ ఒక మాయ.. రైతుభరోసా ఒక భ్రమ అని ఎద్దేవా చేశారు. హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో శనివారం నిర్వహించిన మీడియా సమావేశంలో నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రంలో పాలన గాడి తప్పిందని అన్నారు.
రాష్ట్రంలో రూ.2 లక్షల రుణం మాఫీ అయిన ఒక్క రైతును చూపించాలని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. 60 ఏండ్ల సమైక్య పాలనలో అధోగతి పాలైన తెలంగాణను కేసీఆర్ నాయకత్వంలో పదేళ్లలో దేశంలోనే అగ్రగామి రాష్ట్రంగా నిలిచిందని గుర్తు చేశారు. ఇవాళ దేశంలోనే ధనిక రాష్ట్రాల్లో తెలంగాణ రెండో స్థానంలో ఉందని తెలిపారు. తెలంగాణ కన్నా ముందు దశాబ్దాల క్రితం ఏర్పడిన రాష్ట్రాలు కునారిళ్లి ఉన్నాయని .. ఇది కళ్ల ముందు కనిపిస్తుందని చెప్పారు.
10 నెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వం రూ.80 వేల కోట్లు అప్పుచేసినా ఏ రంగంలోనూ ఒక గణనీయమైన మార్పు లేదని సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. కేసీఆర్ పాలనలో అప్పులు చేసి అనేక రంగాల్లో సమూల మార్పులకు బాటలు వేశామని తెలిపారు. అదే కాంగ్రెస్ ప్రభుత్వం అప్పులు చేసి ఏం చేశారో తెలియదు. కానీ రుణమాఫీ మాత్రం చేయలేదని విమర్శించారు. మొదట రూ.49 వేల కోట్లు రుణమాఫీకి అంచనా వేశారని .. ఆ తర్వాత రేవంత్ రూ.41 వేల కోట్లు రుణమాఫీ చేస్తామని ప్రకటించారని.. అదే బడ్జెట్లో రూ.26 వేల కోట్లుగా చెప్పారని.. చివరికి రూ.17 వేల కోట్లు మాఫీ చేసి అయిపోయిందని చెబుతున్నారని అన్నారు.
రైతుభరోసా ఎగ్గొట్టారు .. పంట కాలం పూర్తవుతున్నా రైతుకు పెట్టుబడి సాయం అందించలేదని సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి మండిపడ్డారు. వరంగల్ డిక్లరేషన్లో రూ.2 లక్షల రుణమాఫీ, రైతుభరోసా, పంటల బీమా, పసుపు బోర్డు, చక్కెర ఫ్యాక్టరీ తెరిపిస్తామఅని గొప్పలు చెప్పారని .. కానీ ఒక్క అడుగు ముందుకు పడలేదని అన్నారు. ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన మూలంగా బీమా కంపెనీలకు లాభం తప్ప రైతులకు ప్రయోజనం ఉండదని చెప్పామని .. కేంద్రమే ఒక కొత్త పథకం తేవాలని అనేకమార్లు విజ్ఞప్తి చేశామని గుర్తు చేశారు. బీమా కంపెనీలు తమ లాభం తప్ప రైతుల లాభం కోసం పనిచేయవని చెప్పామని.. కానీ కాంగ్రెస్ పార్టీ మాత్రం బీమా గురించి గొప్పలు చెబుతున్నారని అన్నారు.
రైతులకు ఏదో చేయాలన్న ఆలోచనతో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల ఉన్నప్పటికీ.. ఆయన సూచనలు ఆమోదించే స్థితిలో సీఎం రేవంత్ రెడ్డి లేరని నిరంజన్ రెడ్డి అన్నారు. రైతుభరోసా రైతుకు, కౌలురైతుకు ఇస్తామని కాంగ్రెస్ చెప్పిందని.. కానీ రైతుభరోసా ఎవరు తీసుకుంటారో రైతు, కౌలురైతు తేల్చుకోవాలని కొద్ది రోజుల క్రితం వ్యవసాయ మంత్రి చావు కబురు చల్లగా చెప్పారని విమర్శించారు.
తెలంగాణలో కౌలురైతు విధానం, ఆంధ్రాలో కౌలు విధానం వేర్వేరుగా ఉంటాయని కేసీఆర్ గారు శాసనసభలో పలుమార్లు చెప్పిన విషయాన్ని నిరంజన్ రెడ్డి ఈ సందర్భగా గుర్తుచేశారు. తెలంగాణలో ఏటా పాలుకు ఇచ్చే విధానం ఉంటుందని.. ఆంధ్రాలో కౌలుకు ఇచ్చే విధానం ఉంటుందని చెప్పామన్నారు. కొందరు ఆంధ్రా నేతల చేతుల్లో ఉన్న రైతు సంఘాలు ఈ వాదన తెచ్చాయి .. దానిని కాంగ్రెస్ అందుకుని కౌలు రైతులకు రైతుభరోసా అని బురిడీ కొట్టించిందన్నారు. ఇప్పుడు అసలు విషయం బయటపెట్టి ముసుగు తొలగించిందని చెప్పారు.
రైతుబంధు ఎగ్గొట్టి రుణమాఫీకి మళ్లించారని.. ఇప్పుడు రైతుభరోసా పది ఎకరాల వరకే అంటున్నారని నిరంజన్ రెడ్డి అన్నారు. కౌలురైతులకు రైతుభరోసా ఇవ్వమని అంటున్న కాంగ్రెస్ సర్కార్ ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. రూ.80 వేల కోట్లు అప్పు చేసినా రైతుభరోసా, రూ.2500 తులం బంగారం, కేసీఆర్ కిట్, న్యూట్రిషన్ కిట్, విద్యార్థులకు అల్పాహారం అన్నీ మాయమయ్యాయని విమర్శించారు.
విజయ డైరీ రైతులకు మూడు నెలలుగా బిల్లులు ఇవ్వడం లేదని నిరంజన్ రెడ్డి అన్నారు. రైతు ఈ దేశ సౌభాగ్యం .. అలాంటి రైతులను రోడ్డెక్కించారని అన్నారు. విజయ డైరీ ప్రభుత్వ డైరీ .. కేసీఆర్ హయాంలో లాభాలు ఎలా వచ్చాయి? ఇప్పుడెలా నష్టాలు వస్తున్నాయని ప్రశ్నించారు. హెరిటేజ్కు లాభాలు ఎలా వస్తాయి? విజయ డైరీ ఎలా నష్టపోతుందని నిలదీశారు. పాలరైతులను హెరిటేజ్ వైపు మళ్లించేందుకు కుట్ర జరుగుతుందని ఆరోపించారు. రూ.204 కోట్లతో హెరిటేజ్ తెలంగాణలో పెట్టుబడులు పెడుతుందని అన్నారు. పాలరైతులు రోడ్డెక్కితే ఒక్క మంత్రి కూడా ఎందుకు మాట్లాడటం లేదని నిరంజన్ రెడ్డి నిలదీశారు. అంత తీరిక లేదా అని ప్రశ్నించారు.
లొసుగులు ఎత్తిచూపుతున్న ప్రతిపక్షాల మీద వ్యక్తిగత దూషణలు చేస్తున్నారని నిరంజన్ రెడ్డి మండిపడ్డారు. విపక్షాలు అధికార పార్టీ మీద ఆరోపణలు చేస్తే వివరణ ఇస్తాయని.. కానీ విచిత్రంగా తెలంగాణలో అధికార పార్టీ నేతలు విపక్షాల మీద దాడి చేస్తున్నారని విమర్శించారు. ఎదుటి వారికి గౌరవం ఇస్తేనే తిరిగి గౌరవం లభిస్తుందని హితవు పలికారు. విచిత్రంగా సీఎం ఇక్కడ నేను తిడతాను గానీ మీరు నా సీటుకు గౌరవం ఇవ్వాలని అంటున్నారని మండిపడ్డారు.
కాంగ్రెస్ వస్తే రైతుబంధు ఇవ్వలేదని మేం చెప్పిన మాటలే నిజమయ్యాయని నిరంజన్ రెడ్డి అన్నారు. పంటల బీమా విషయంలో ప్రపంచ దేశాల్లో ఉన్న విధానాలను అధ్యయనం చేసి ఒక మంచి పాలసీ తేవాలని ప్రభుత్వానికి, వ్యవసాయ మంత్రికి విజ్ఞప్తి చేస్తున్నానని అన్నారు. బీమా కంపెనీలు ఎప్పుడూ నష్టపోయి రైతుకు మేలు చేయవని.. ఇది వాస్తవమని అన్నారు.
కేసీఆర్ హయాంలో పంటల బీమా కోసం నాలుగేళ్లు రూ.2400 కోట్లు బీమా కంపెనీలకు కడితే రైతులకు తిరిగి రూ.1800 కోట్లే వచ్చాయని నిరంజన్ రెడ్డి అన్నారు. అధికారంలోకి వచ్చి 9 నెలలు అయినా ఇప్పటి వరకు రాష్ట్రంలో ఒక్క రైతుకు పంట నష్టం ఇవ్వలేదని తెలిపారు. అబద్దపు హామీలతో అధికారంలోకి వచ్చి .. అబద్దాలతోనే పాలన చేస్తున్న విషయాన్ని ప్రజలు గమనిస్తున్నారని పేర్కొన్నారు.
హైడ్రాతో హైదరాబాద్ ఇమేజ్ను .. అడ్డగోలు మాటలతో తెలంగాణ ఇమేజ్ను దెబ్బతీస్తున్నారని నిరంజన్ రెడ్డి మండిపడ్డారు. ఆక్రమణల తొలగింపు కోసం ఇప్పటికే ఉన్న చట్టాలను గాలికి వదిలేసి హైడ్రా పేరుతో హైప్ సృష్టిస్తున్నారని తెలిపారు. దీనికి ఒక సెక్షన్ మీడియా ఏదో అద్భుతం జరుగుతుంది అన్నట్లు ప్రచారం చేస్తున్నాయని అన్నారు. గతంలో పెద్ద పెద్ద వారి మీద ఆరోపణలు చేసి .. అధికారంలోకి వచ్చాక నోరు మూసుకోవడం వెనక ఏం జరిగిందని ప్రశ్నించారు. పేదల ఇండ్లను కూలగొట్టి పెద్దలను లొంగ తీసుకుంటున్నారని ఆరోపించారు. ఇప్పటికైనా ప్రభుత్వ తీరు మార్చుకోకుంటే ప్రజలే బుద్ధి చెబుతారని అన్నారు.