Niranjan Reddy | హైదరాబాద్ : కృష్ణా తుంగభద్ర నదులే పాలమూరు జిల్లాకు జీవనాధారం అని మాజీ వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి స్పష్టం చేశారు. తెలంగాణ భవన్లో నిరంజన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. 360 రోజులు నీటిని ఉపయోగించుకునేలా కేసీఆర్ పాలమూరు – రంగారెడ్డి ప్రాజెక్ట్ తలపెట్టారు. కొడంగల్, నారాయణ పేటకు నీరు ఇవ్వడానికి పాలమూరు నుంచి రెండు కెనాల్స్ణు ప్రతిపాదించారు. ప్రస్తుతం పాలమూరు – రంగారెడ్డిలో కేవలం 7 నుంచి 10 శాతం పనులు మాత్రమే పెండింగ్లో ఉన్నాయి. ఆ పనులు పూర్తిచేస్తే కొడంగల్, నారాయణ పేటకు గ్రావిటీ ద్వారా నీరు అందించవచ్చు. కానీ ఆ రెండు కెనాల్స్ పనులను కాంగ్రెస్ ప్రభుత్వం రద్దు చేసింది. కొత్తగా రూ.2,900 కోట్లతో ఆ రెండు నియోజకవర్గాల కోసం కొత్త ప్రాజెక్ట్కు ప్లాన్ చేసింది. ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి భూమిపూజ చేస్తున్నారు. కానీ ప్రతిపాదిత నిధుల్లో కేవలం అరవై డెబ్బై శాతం ఖర్చు పెడితే ఓపెన్ కెనాల్తో నీరు ఇవ్వొచ్చు. కేసీఆర్ కట్టిన ప్రాజెక్టుతో నీరు ఇవ్వొద్దనే భేషజంతోనే సీఎం రేవంత్ మళ్లీ కొత్త ఎత్తిపోతలకు శ్రీకారం చుట్టారు అని నిరంజన్ రెడ్డి తెలిపారు.
పాలమూరు, రంగారెడ్డి పనులు పూర్తి చేసి నీరిస్తేనే ఎక్కువ ప్రయోజనం కలుగుతుందన్నారు నిరంజన్ రెడ్డి. జూరాలపై కొత్త ఎత్తిపోతల ప్రాజెక్ట్ నిర్మాణం వల్ల ప్రజలపై భారం పడుతుంది. బేషజాలకు వెళ్లకుండా కెనాల్స్ పూర్తి చేస్తే తక్కువ ఖర్చుతో నీరు ఇవ్వొచ్చు. శ్రీశైలంకు వచ్చే నీటిని ఆపేసేలా కర్ణాటక ప్రభుత్వం తుంగభద్ర నదిపై బ్యారేజ్ నిర్మాణం తలపెడుతోంది. ముందు దాన్ని అడ్డుకోవడంపై ప్రభుత్వం దృష్టి పెట్టాలి. కర్ణాటకలో ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వమే మాట్లాడి దాన్ని అడ్డుకోవాలి అని నిరంజన్ రెడ్డి సూచించారు.
జాతీయ పార్టీల పొత్తుల కోసం అర్రులు చాచటం లేదు. జాతీయ పార్టీలే ప్రాంతీయ పార్టీలతో పొత్తులు కోసం ప్రయత్నిస్తున్నాయి. పార్టీల పొత్తులు అనేవి అయా పార్టీల అధినేతలు నిర్ణయిస్తారన్నారు అని నిరంజన్ రెడ్డి స్పష్టం చేశారు.