Malla Reddy | ఇకపై ఎన్నికల్లో మళ్లీ పోటీ చేయనని.. ఇవే తనకు చివరి ఎన్నికల మాజీ మంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్టీ మారనున్నారని వస్తున్న వార్తలను ఆయన కొట్టిపడేశారు. అయితే, తన అల్లుడు మర్రి రాజశేఖర రెడ్డి, తనయుడు భద్రారెడ్డితో బెంగళూరు వెళ్లిన అక్కడ కర్ణాటక ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్ను కలిశారు. ఈ నేపథ్యంలో పార్టీ మారనున్నారని ప్రచారం జరిగింది. అయితే, పార్టీ మారనున్నారనే వార్తలపై ఆయన క్లారిటీ ఇచ్చారు.
బెంగళూరులో డీకే శివకుమార్ను ఓ ప్రైవేటు కార్యక్రమంలో కలిసినట్లు తెలిపారు. రెండు రోజుల కింద కలిశానని.. ఇందులో ఎలాంటి రాజకీయం లేదన్నారు. శివకుమార్ నాకు మిత్రుడని పేర్కొన్నారు. ప్రస్తుతం తన వయసు 71 సంవత్సరాలని.. ఈ సమయంలో పార్టీ మారే అవకాశం లేదన్నారు. తాను బీఆర్ఎస్లోనే కొనసాగుతానని.. తమ కుటుంబ సభ్యులు వేరే పార్టీల నుంచి పోటీచేయరన్నారు. ఈ ఐదేళ్లు ప్రజాసేవ చేసి రాజకీయాల నుంచి తప్పుకుంటానన్నారు. వచ్చే ఎన్నికల్లో మళ్లీ పోటీ చేయనని.. ఇవే నాకు చివరి ఎన్నికలని స్పష్టత ఇచ్చారు.