KTR | కేసీఆర్, బీఆర్ఎస్ పాలనపై కాంగ్రెస్ ప్రభుత్వం బురదజల్లేందుకు ప్రయత్నించింది బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు విమర్శించారు. తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ తొమ్మిదిన్నరేల్ల పాలనపై ఆయన ‘స్వేదపత్రం’ పేరుతో పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం ఏదైతే ఉన్నదో ఉద్దేశపూర్వకంగా బీఆర్ఎస్ పార్టీని, గత పది సంవత్సరాల కేసీఆర్ నాయకత్వంలో పరిపాలనను బద్నాం చేసే విధంగా ప్రజల్లో అపోహలు, అనుమానాలు సృష్టించే విధంగా, బురద చల్లే ప్రయత్నం చేసిన విషయం తెలిసిందే. శాసనసభలో మా పార్టీ నాయకులు జగదీశ్వర్రెడ్డి, హరీశ్రావు, పార్టీ తరఫున నేను గాని ప్రభుత్వం మా మీద చేసే ఆరోపణలు, కొన్ని కువిమర్శలకు ధీటుగా సమాధానం చేసిన కాబట్టే మాకు సావధానంగా మాట్లాడే అవకాశం ఇవ్వకుండా గొంతునొక్కింది’ అంటూ ఆరోపించారు.
‘చివరకు శ్వేతపత్రాలు హడావుడి చేసి ఆఖరికి వాయిదా వేసుకొని ప్రభుత్వం పారిపోయిన విషయాన్ని మీరు చూశారు. అయితే, వాళ్లు లేవనెత్తిన కొన్ని సందేహాలు, చేసిన ఆరోపణలు ఇవన్నింటి విషయంలో బాధ్యత కలిగిన పార్టీగా, గతపదేళ్లు ప్రజలు మాకు అవకాశం ఇచ్చినప్పుడు ఏం జరిగింది ? ఎట్లా జరిగింది ? ప్రజలకు వివరించాల్సిన బాధ్యత మా మీద ఉన్నది. అందుకే స్వేదపత్రాన్ని విడుదల చేస్తున్నాం. పదేళ్లు చమటోడ్చి, రక్తాన్ని రంగరించి.. వందల, వేల గంటలు పనిచేసి ఒక్క మా ప్రభుత్వంలోని మంత్రులు, ఎమ్మెల్యేలు, సీఎం మాత్రమే కాదు.. లక్షల మంది ఉద్యోగులు, కోట్ల మంది ప్రజలు తమ స్వేదంతో, తమ కష్టంతో ఈ రాష్ట్ర అభ్యున్నతికి తోడ్పడ్డారో.. ఏ రకంగా ముందుకు తీసుకెళ్లారో చెప్పాల్సిన బాధ్యత ఈ స్వేదపత్రం ద్వారా మీ మీద ఉన్నది. ఎక్కడికి చేరుకున్నమో తెలియాలి అంటే.. ఎక్కడ మొదలయ్యామో కూడా గుర్తుపెట్టుకోవాలి అంటారు’ అన్నారు.
‘అందుకే ఒక్క మాటలో చెప్పాలంటే విధ్వంసం నుంచి వికాసం వైపు.. సంక్షోభం వైపు సమృద్ధి వైపు జరిగిన ఈ ప్రయాణం.. కొత్త రాష్ట్రంలో గత పదేళ్ల ప్రగతి ప్రస్థానం ఏదైతే ఉందో భారతదేశ చరిత్రలోనే ఇది ఒక సువర్ణ అధ్యాయం. 60 సమైక్య పాలన.. 60 ఏళ్లలో జరిగిన జీవన విధ్వంసం ఒకవైపు అయితే.. మరి నేరపూరిత నిర్లక్ష్యంతో ఉద్దేశపూర్వకమైన నిర్లక్ష్యంతో మన రాష్ట్రాన్ని నాశనం చేసే, జీవన విధ్వంసం చేసే ప్రయత్నం అప్పటి పాలకులు చేశారు. అది కాంగ్రెస్ పాలకులు కావొచ్చు. ఇతరులు కావొచ్చు. వారి వివక్ష వల్ల శిథిలమైన ప్రాంతం.. పక్షపాతంతో చిక్కిశల్యమైన ప్రాంతం మన తెలంగాణ. అందుకే మాటల్లో కంటే కూడా.. ఆనాటి ఫ్రీ లాన్స్ జర్నలిస్ట్ ఆ రోజుల్లో తెలంగాణ ఉద్యమం నుంచి ప్రేరణ పొంది ఆయన ‘తెలంగాణ స్టిల్ సీకింగ్ జస్టిస్’ పేరుతో ఒక డాక్యుమెంటరీని రూపొందించారు. దాన్ని చూస్తే చూస్తే కళ్లకు కట్టినట్లు అర్థమవుతుంది’ అన్నారు. కేటీఆర్. ఈ సందర్భంగా వేదికపై ఆ డాక్యుమెంటరీని కేటీఆర్ ప్రదర్శించారు.