Jagadish Reddy | పాలనకంటే కుట్రలు, కుతంత్రాలకే సీఎం రేవంత్ ప్రాధాన్యం ఇస్తున్నారని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్రెడ్డి మండిపడ్డారు. సూర్యాపేటలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో రైతుదీక్ష నిర్వహించారు. కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. కాళేశ్వరంపై చిల్లర ప్రేలాపనలు చేయడమే ఇందుకు అద్దంపడుతుందని ఆయన విరుచుకుపడ్డారు. పంట నష్టంపై సీఎంతో సహా ఏ ఒక్కరూ ఎందుకు పెదవి విప్పడం లేదని ఆయన నిలదీశారు. జరుగుతున్న ఘోరకలిని చూసి ఆత్మస్థయిర్యం దెబ్బతిన్న రైతాంగాన్ని పరామర్శించేందుకు మండుటెండలను ఖాతరు చేయకుండా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పొలంబాట పట్టారన్నారు. ఇవేమీ పట్టని ముఖ్యమంత్రితో సహా అధికార పార్టీ యంత్రాంగం మొత్తం క్రికెట్ మోజులో నిమగ్నమయ్యారని ఆయన విమర్శించారు. ప్రభుత్వ ద్రోహంతోటే తెలంగాణలో పంటలు నాశనమయ్యాయని ఆరోపించారు.
ఉమ్మడి నల్లగొండ జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఇద్దరు మంత్రులు గజదొంగల్లా దోపిడీకి పాల్పడుతున్నారని తీవ్రస్థాయిలో ఆరోపించారు. కాంట్రాక్టర్లను, రైస్ మిల్లర్లను బెదిరించి మరీ వసూళ్లకు పాల్పదడమే ఇందుకు నిదర్శనమన్నారు. రేవంత్ ఢిల్లీ బాస్ల చుట్టూ తిరగడమే సరిపోతుందన్నారు. ఇక్కడ వసూలు చేసిన దోపిడీ సొత్తును ఢిల్లీ పెద్దలకు కప్పం కట్టేందుకే రేవంత్ రెడ్డి ఢిల్లీకి చక్కర్లు కొడుతున్నారన్నారు. ఎన్నికల హామీలో భాగంగా ఇచ్చిన రుణమాఫీ, రూ.500 బోనస్ ఏమయ్యాయని ఆయన నిలదీశారు. ఎన్నికల కోడ్ను అడ్డుపెట్టకొని రుణమాఫీ, రూ.500 బోనస్ ఎగ్గొట్టేందుకు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. రైతులపై రాష్ట్ర ప్రభుత్వానికి ప్రేమ ఉంటే ఎన్నికల సంఘం అనుమతితో రుణమాఫీ, బోనస్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఎన్నికల సంఘం అనుమతి కోరుతూ రేవంత్ ఎన్నికల సంఘానికి లేఖ రాసేటట్లయితే అందుకు మద్దతుగా బీఆర్ఎస్ పార్టీ లేఖ రాస్తుందన్నారు.