Jagadish Reddy | కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ పూర్తిగా తిరోగమన బడ్జెట్ అని.. ఆరు గ్యారంటీలను అకెక్కించే బడ్జెట్ అని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్రెడ్డి విమర్శించారు. సూర్యాపేటలో మీడియా సమావేశంలో పాల్గొన్న ఆయన కాంగ్రెస్ ప్రభుత్వ తీరుపై విరుచుకుపడ్డారు. ఇచ్చిన హామీలను నెరవేర్చాలని చిత్తశుద్ధి కాంగ్రెస్ ప్రభుత్వానికి లేదని నేటితో తేలిపోయిందన్నారు. ప్రభుత్వానికి ఐదు నుంచి 6 నెలల సమయం ఇవ్వాలని మా నేత కేసీఆర్ చెప్పారన్నారు. రైతులను చెప్పులతో కొట్టండి అనే మాట్లాడే అహంకారాన్ని ప్రశ్నించకుండా ఎలా ఉంటామని ప్రశ్నించారు. ఇలాంటి మోసపూరిత బడ్జెట్ను దేశ చరిత్రలో ఏ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు ప్రవేశపెట్టలేదని విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ గెలుపును భుజస్కందాలపై మోసిన నిరుద్యోగులను, యువకులను ప్రభుత్వం నిండా మోసం చేసిందని దుయ్యబట్టారు.
రూ.2లక్షల రుణమాఫీ ఒకేసారి చేస్తామన్న ప్రభుత్వం రుణమాఫీ ప్రస్తావనే బడ్జెట్లో తీసుకురాలేదన్నారు. రైతుబంధు రూ.15వేలు చేస్తామని, అన్ని పంటలకు రూ.500 బోనస్ ఇస్తామని ఇచ్చిన హామీలను వ్యవసాయ పద్దుల్లో ఎక్కడ కూడా ఆ ప్రస్తావనే లేదన్నారు. మహిళలకు ఉచిత ప్రయాణం వారిపై ప్రేమతో పెట్టలేదని.. వారి పర్సులు కొట్టేయడం కోసమేనన్నారు. అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఈ రోజు నిజమయ్యాయన్నారు. మహిళలకు నెలకు రూ.2500 ఇస్తామన్న ప్రభుత్వం ఎక్కడ బడ్జెట్లో కేటాయింపులు చేయలేదన్నారు. ఏ పథకమైన బడ్జెట్లో ప్రవేశపెడితేనే వస్తాయన్న ఆయన ఆటోవాలాలకు ఇస్తామన్న రూ.12వేల ప్రస్తావన ఎక్కడా తెలేదన్నారు. ఆటో కార్మికులను అవమానించేకరంగా ముఖ్యమంత్రి వ్యాఖ్యలు ఉన్నాయన్నారు.
అన్ని వర్గాలను మోసం చేసే విధంగా బడ్జెట్ ఉందన్నారు. దళితులు, గిరిజన అభివృద్ధిపై ఎక్కడా కూడా కేటాయింపులు లేవన్న ఆయన ఉన్న పథకాలను తీసేసి ప్రజలను కాంగ్రెస్ ప్రభుత్వం నిండా ముంచిందన్నారు. అలీబాబా 40 దొంగల్లా రేవంత్ బ్యాచ్ తెలంగాణ ప్రజలను మోసం చేస్తున్నారన్నారు. గృహజ్యోతి పథకం ద్వారా అందరికీ 200 యూనిట్ల విద్యుత్ బిల్లు మాఫీ అన్న ప్రభుత్వం, కొత్త దరఖాస్తులు తీసుకోవడం ఎందుకని ప్రశ్నించారు. విధ్యుత్ రంగ సంస్థల ద్వారా పథకాన్ని నేరుగా అమలు చేసే అవకాశం ఉందన్నారు. గృహజ్యోతి పథకానికి కేటాయించిన బడ్జెట్ రాష్ట్రంలో పావుల శాతం మందికి కూడా సరిపోవు అన్నారు. ఇంత దగాపూరిత మోసపూరిత బడ్జెట్ ఎప్పుడూ చూడలేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ అసలు రంగు తెలంగాణ ప్రజలకు నేడు తెలిసిందన్నారు. తెలివి లేక అయినా లేదా.. మోసం చేయాలని ధోరణితోనే బడ్జెట్ ఉందన్నారు. ప్రభుత్వంపై తెలంగాణ ప్రజలు తస్మాత్ జాగ్రత్తగా ఉండాలన్న జగదీశ్ రెడ్డి, గ్రామాల్లోకి వచ్చే ప్రభుత్వ ప్రజాప్రతినిధులను ఆరు గ్యారంటీ అమలుపై ఎక్కడికక్కడ నిలదీయాలని పిలుపునిచ్చారు.
రాష్ట్ర ప్రయోజనాల కోసం కృష్ణాజాలపై హక్కును కాపాడుకోవాలన్న సోయి లేని కాంగ్రెస్ ప్రభుత్వం మేడిగడ్డ కాదు కదా యే గడ్డకు పోయినా గట్టెక్కలేరని జగదీశ్ రెడ్డి ఎద్దేవా చేశారు. కేఆర్ఎంబీలో సంతకాలు పెట్టి అడ్డంగా దొరికిపోయారన్నారు. సంతకాలు పెట్టింది మాకు తెలవదనడం సిగ్గుచేటన్నారు. కృష్ణా జలాల విషయంలో ఎందుకు ఈ రోజు వరకు కేంద్రాన్ని అడగడం లేదని ప్రశ్నించారు. కాంగ్రెస్ దొంగతనాలను బయటపెట్టాలని నల్గొండ సభకు శ్రీకారం చుట్టామన్న జగదీశ్ రెడ్డి.. నల్లగొండ సభ పెడితే ఎందుకు భయపడుతున్నారో.. భుజాలు తడుముకుంటున్నారో అర్థం కావడం లేదన్నారు. కాలేశ్వరానికి పోతే కృష్ణా జలాల హక్కులు ఎలా వస్తాయో అర్థం కావడం లేదన్నారు. పంచాయితీ కృష్ణా జిల్లాలో అయితే గోదావరికి పోవడం ప్రజలు డైవర్ట్ చేయడం కోసమే అన్నారు. కాంగ్రెస్ దొంగ వేషాలను బయటపెట్టాలని నల్గొండ సభకు శ్రీకారం చుట్టామన్నారు. కృష్ణ నీటి విషయంలో కాంగ్రెస్ నేతలు దొరికిన దొంగలుగా అభివర్ణించారు. కృష్ణ అప్పులను కాపాడుకుంటే రైతులు వెంటపడి తరుముతారన్నారు.
ఓటుకు నోటు కేసు విషయంలో ముఖ్యమంత్రి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారని జగదీశ్రెడ్డి ఆరోపించారు. గతంలో విచారణ కొనసాగకుండా ఆపే ప్రయత్నం చేశారని, అధికారంలోకి రాగానే విచారణకు తొందరపెట్టి తప్పించుకుని బయటపడే ప్రయత్నం చేస్తున్నారన్నారు. నిందితుడు అధికారంలో ఉంటే విచారణ సజావుగా సాగదన్నారు. అందుకే పక్క రాష్ట్రానికి బదిలీ చేయాలని సుప్రీంను ఆశ్రయించామన్నారు. అన్ని వ్యవస్థలు ప్రభుత్వం కంట్రోల్లో ఉంటే సాక్ష్యాలు ప్రభావితం ప్రలోభాలకు కూడా అయ్యే అవకాశం ఉందన్నారు. గతంలో తమిళనాడు ముఖ్యమంత్రిగా జయలలిత విషయంలో కూడా ఇదేవిధంగా జరిగిందని గుర్తు చేశారు.