నల్లగొండ రూరల్, మార్చి 18: రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, మంత్రులకు ఢిల్లీకి ముడుపులిచ్చే తపన తప్ప కర్ణాటక రాష్ట్రం నుంచి కనీసం 10 టీఎంసీల నీళ్లు తేవాలన్న సోయి లేదని రాష్ట్ర ప్రభుత్వంపై మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్రెడ్డి మండిపడ్డారు. ఆ రాష్ట్రం నుంచి 10 టీఎంసీల నీటిని తెచ్చుకుంటే ఉమ్మడి నల్లగొండ, మహబూబ్నగర్ జిల్లాల్లో పంటలు ఎండిపోయే పరిస్థితి ఉండేది కాదని చెప్పారు.
నల్లగొండ జిల్లా నల్లగొండ మండలం అన్నెపర్తి గ్రామంలో సోమవారం ఆయన ఎండిపోయిన పంట పొలా లు, నిమ్మ తోటలను మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డితో కలిసి పరిశీలించారు. ట్యాంకర్లతో పొలానికి నీరు పెడుతున్న రైతులతో ముచ్చటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లా మంత్రికి వసూళ్ల మీద సోయి తప్ప రైతుల సమస్యల మీద లేదని ఆగ్రహం వ్యక్తంచేశారు. వ్యాపారులు, కాంట్రాక్టర్లను బ్లాక్మెయిల్ చేసి డబ్బులు సంపాదించే పనిలో ఉన్నారు తప్ప వంద రోజుల పరిపాలనలో ఒరిగిందేమీ లేదని మండిపడ్డారు.
ఇద్దరు మంత్రులవి ప్రగల్భాలే
మంత్రులు ఉత్తమ్కుమార్రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ప్రగల్భాలు పలుకడం తప్ప దేనికి పనికిరారని జగదీశ్రెడ్డి విమర్శించారు. సూర్యాపేట, కోదాడతోపాటు అన్ని నియోజకవర్గాల్లో పూర్తిస్థాయిలో పంటలు ఎండిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. మూసీ ప్రాజెక్టు కింద నీరు అందించే అవకాశం ఉన్నా ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నదని మండిపడ్డారు. నాగార్జునసాగర్ ఆయకట్టులో కూడా ఎగువన నారాయణపురం, ఆల్మట్టి డ్యామ్ నుంచి నీటిని తెప్పించి రైతులకు అందించాలని డిమాండ్ చేశారు.
పంట పొలాలు ఎండిపోవడంతో పెట్టుబడి పోయి రైతులు విలపిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం కరువుపై సర్వే చేయించి నష్టపోయిన రైతులకు పరిహారం అందించి ఆదుకోవాలని డిమాండ్ చేశారు. లేదంటే రైతుల ఉసురు తగిలి కాంగ్రెస్ ప్రభుత్వం నాశనం అవుతుందని మండిపడ్డారు. ఆయన వెంట నల్లగొండ మున్సిపల్ మాజీ చైర్మన్ మందడి సైదిరెడ్డి, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు చెరుకు సుధాకర్, బీఆర్ఎస్ నల్లగొండ మండలాధ్యక్షుడు దేప వెంకట్రెడ్డి, సీనియర్ నాయకులు బకరం వెంకన్న, తుమ్మల లింగస్వామి, పీఏసీఎస్ చైర్మన్ నాగరత్నం రాజు ఉన్నారు.
మా బతుకులు ఆగమైనయ్: మహిళా రైతు చంద్రమ్మ
పంట పొలాల పరిశీలనలో భాగంగా మహిళా రైతు చంద్రమ్మతో ఎమ్మెల్యే జగదీశ్రెడ్డి మాట్లాడారు. ఎంత నాటు పెట్టావు.. ఎంత ఎండిపోయింది అని అడిగారు. చంద్రమ్మ విలపిస్తూ ‘మా బతుకులు ఆగం అయినాయి సార్. మమ్మల్ని ఆదుకోవాలి. ఐదు ఎకరాలు ఉంటే బోర్లు సక్కగా పోస్తాయో, పోయవో అని రెండెకరాలు నాటు పెట్టిన. మూడు బోర్లు పూర్తిగా ఎండిపోయినయ్. మళ్ల మూడు బోర్లు వేసినా సుక్క నీరు రాలే.
ఉన్న రెండెకరాలు ఎండిపోతుంటే పాణం తల్లడిల్లింది. పంట చేతికొచ్చే సమయం కాబట్టి రోజూ ట్యాంకర్లు పెట్టి నీరు పోస్తున్నాం. రెండు ఎకరాలకు ఇప్పటికే రెండు లక్షల పెట్టుబడి అయ్యింది. పంటలతోపాటు గొడ్లకు కూడా నీళ్లు కరువైనయి. కరెంట్ సక్కగా రాక, కాల్వల్లో నీరు లేక, బోర్ల నీళ్లు లేక నానా అవస్థలు పడి ఆగమైపోతున్నాం. మమ్మల్ని ఆదుకోవాలె. నాకు ఇప్పటివరకు రైతుబంధు సాయం కూడా అందలేదు’ అని గోడును వెల్లబోసుకుంది.