హైదరాబాద్, ఫిబ్రవరి 28 (నమస్తే తెలంగాణ): ఒకటో తేదీన వేతనాలు చెల్లిస్తామని చెప్పిన కాంగ్రెస్ పార్టీ ఆచరణలో మాత్రం మాట తప్పిందని మాజీ మంత్రి హరీశ్రావు ధ్వజమెత్తారు. గత ఏడాది డిసెంబర్ నెలకు సంబంధించి 10,632 మంది సమగ్ర శిక్ష ఉద్యోగులకు, జనవరి, ఫిబ్రవరి నెలలకు సంబంధించి 12,660 మంది సమగ్ర శిక్ష ఉద్యోగులకు వేతనాలు అందలేదని మండిపడ్డారు. ప్రభుత్వ పాఠశాలల్లోని మధ్యాహ్న భోజన కార్మికులకు 3 నెలల నుంచి వేతనాలు, మధ్యాహ్న భోజనానికి సంబంధించి వంట ఛార్జీలు, కోడిగుడ్ల బిల్లులు పెండింగ్లో ఉన్నాయని వివరించారు. వెంటనే పెండింగ్ వేతనాలను చెల్లించాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు ఎక్స్ (ట్విట్టర్) వేదికగా మాజీ మంత్రి హరీశ్రావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.