Harish Rao | హైదరాబాద్ : కాళేశ్వరం ఎప్పటికైనా తెలంగాణకు జీవధార.. ఈ విషయం తెలంగాణ ప్రజలకు అర్థమైంది అని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు తెలిపారు. కాళేశ్వరం కమిషన్ ముందు ఏదీ నోటి మాటగా చెప్పలేదు. అన్నీ సాక్ష్యాధారాలతో సహా సమర్పించడం జరిగిందని స్పష్టం చేశారు. క్యాబినెట్ నిర్ణయాలు, వాప్కోస్ రిపోర్టులు, సీడబ్ల్యూసీ లేఖలు అన్నీ సమర్పించడం జరిగిందని హరీశ్రావు తెలిపారు. కాళేశ్వరం కమిషన్ విచారణ ముగిసిన అనంతరం బీఆర్కే భవన్ వద్ద హరీశ్రావు మీడియాతో మాట్లాడారు.
ఈ రోజు కాళేశ్వరం కమిషన్ విచారణలో భాగంగా పిలవడం జరిగింది. కమిషన్ అడిగిన అన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పడం జరిగింది. ఆధారాలతో సమాధానాలను కమిషన్కు అందించడం జరిగింది. కమిషన్ విచారణకు హాజరై రాజకీయాలు మాట్లాడటం సరికాదు. రాజకీయాలు ఏమైనా ఉంటే రేపు మాట్లాడుకుందాం. లోపట ఒకటి చెప్పి బయట ఒకటి చెప్పడం తప్పు అవుతుందని హరీశ్రావు పేర్కొన్నారు.
మొట్టమొదలు తమ్మిడిహట్టి నుండి మేడిగడ్డకు బ్యారేజ్ను ఎందుకు మార్చారు అనేదానిపై చాలాసేపు డిస్కషన్ జరిగింది. దానికి నేను కొత్తగా ఏర్పడిన తెలంగాణ ప్రభుత్వం తమ్మిడిహట్టి దగ్గరే ప్రాజెక్టు కట్టడానికి అన్ని రకాల ప్రయత్నాలు చేశాం. ఇరిగేషన్ మంత్రిగా రివ్యూ చేసినప్పుడు ప్రాణాహిత ప్రాజెక్టు 7 ప్యాకేజీలు 27 భాగాలుగా టెండర్లను పిలిచింది గత కాంగ్రెస్ ప్రభుత్వం. తల పనులు స్టార్ట్ చేయకుండా తోక పనులను కాంగ్రెస్ ప్రభుత్వం తవ్వింది అని హరీశ్రావు తెలిపారు.
మహారాష్ట్ర కాంగ్రెస్ ఇరిగేషన్ మంత్రి హసన్ ముష్రఫ్ను తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటైన నెలకే వెళ్లి కలవడం జరిగింది. తమ్మిడిహట్టి వద్ద ప్రాజెక్టు నిర్మాణానికి అనుమతి ఇవ్వండని అప్పటి మహారాష్ట్ర కాంగ్రెస్ మంత్రి హసన్ ముష్రఫ్ను కోరడం జరిగింది. ఇరిగేషన్ మంత్రిగా ఉన్నటువంటి హాసన్ ముష్రఫ్.. చాలా రోజులుగా ముంపు గ్రామాల ప్రజలు మా ప్రభుత్వంపై నిరసన కార్యక్రమాలు చేస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో మేము ప్రాజెక్టు 152 మీటర్ల ఎత్తులో నిర్మాణానికి ఒప్పుకోమని తేల్చి చెప్పారు. ఇదే విషయాన్ని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి చౌహాన్ అప్పటి ఉమ్మడి ఏపీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిరికి ఈ ప్రాజెక్టు 152 మీటర్ల ఎత్తులో నిర్మించడానికి ఒప్పుకోమని తేల్చి చెప్పారని చెప్పడం జరిగింది. ఈ విషయాన్ని కూడా కమిషన్ దృష్టికి తీసుకు వెళ్ళామని హరీశ్రావు తెలిపారు.
మహారాష్ట్ర, తెలంగాణ మధ్య తమ్మిడిహట్టి వద్ద ప్రాజెక్టు నిర్మాణానికి ఐదారు మీటింగ్స్ జరిగాయి. మహారాష్ట్రలో కాంగ్రెస్ ప్రభుత్వం పోయి బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత నీటిపారుదల శాఖ మంత్రిని కలిసి మళ్లీ తమ్మిడిహట్టి వద్ద ప్రాజెక్టు నిర్మాణానికి సహకరించాలని, తెలంగాణకు నీటి అవసరం ఉందని కోరడం జరిగింది. స్వయంగా కేసీఆర్ మహారాష్ట్రకు వెళ్లి అప్పటి గవర్నర్ విద్యాసాగర్ సమక్షంలో బిజెపి ముఖ్యమంత్రి ఫడ్నవీస్ను కలిశారు. ఏడేండ్లు మాకంటే ముందు ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వంపై బిజెపి పార్టీ తరఫున ఈ ప్రాజెక్టు నిర్మాణానికి వ్యతిరేకిస్తూ అనేక పోరాటాలు చేసింది తానేనని ఇప్పుడు ఆ ప్రాజెక్టుకు పర్మిషన్ ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వలేమని ఫడ్నవీస్ తేల్చి చెప్పారని హరీశ్రావు గుర్తు చేశారు.
కేంద్రంలో కాంగ్రెస్, మహారాష్ట్రలో కాంగ్రెస్, ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ ఏడు సంవత్సరాలు అధికారంలో ఉంటే ఒక్క అనుమతి కూడా సాధించలేదు. ఒక్క అంతర్ రాష్ట్ర ఒప్పందం చేసుకోలేదు. ఒక గుంట భూమిని కూడా సేకరించలేదు. తమ్మిడిహట్టి వద్ద ప్రాజెక్టు నిర్మాణంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. తెలంగాణ ప్రాంతం నుంచి మంత్రులుగా ఉన్న కోమటిరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి పట్టించుకోలేదు. సెంట్రల్ వాటర్ కమిషన్ తమ్మిడిహట్టి వద్ద నీటి లభ్యత లేదు అని ప్రాజెక్టు నిర్మాణానికి ప్రత్యామ్నాయం చూసుకోవాలని లేఖ రాసింది. అదేవిధంగా CWC తమ్మిడిహట్టి ప్రాజెక్టులో ప్రతిపాదించిన రిజర్వాయర్ల సామర్థ్యం కూడా సరిపోదని సామర్థ్యానికి సరిపోయే రిజర్వాయర్లను పెంచుకోవాలని ఉత్తరం రాసింది. ఈ క్రమంలోనే కేంద్ర ప్రభుత్వ సంస్థ వ్యాప్కోస్ని బ్యారేజ్ నిర్మాణ స్థల ఎంపిక చేయాలని కేసీఆర్ కోరడం జరిగింది. కేంద్ర సంస్థ వాప్కోస్ లాడార్ సర్వే చేసి, ఎగ్జామిన్ చేసి మేడిగడ్డ వద్ద నీటి లభ్యత ఉంది అక్కడ ప్రాజెక్టు నిర్మాణం చేసుకోవచ్చని తెలిపింది. వాప్కోస్, సెంట్రల్ వాటర్ కమిషన్, ఇంజనీర్ల సూచన మేరకు మేడిగడ్డ వద్ద ప్రాజెక్ట్ నిర్మాణం జరిగింది అని హరీశ్రావు తెలిపారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఏడేండ్లుగా పొరుగు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒప్పించలేదు. అదేవిధంగా మహారాష్ట్రలో ముంపుకు గురవుతున్న చోట చాప్రాల్ వైల్డ్ లైఫ్ ఉంది. వైల్డ్ లైఫ్ అనుమతులు లభించాలంటే కనీసం 10 సంవత్సరాలు సుప్రీంకోర్టులో కొట్లాడాల్సి వస్తుంది. నీళ్లు లేనిచోట కాంగ్రెస్ ప్రాజెక్ట్ ప్రతిపాదిస్తే నీళ్లు ఉన్నచోట ప్రాజెక్టును బిఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిపాదించడం జరిగింది. అన్ని రకాల ఆధారాలు మహారాష్ట్ర ముఖ్యమంత్రి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి రాసిన ఉత్తరాలు, జీవోలు అన్నీ కమిషన్కు సమర్పించడం జరిగింది అని హరీశ్రావు పేర్కొన్నారు.
కాళేశ్వరం కార్పొరేషన్కి అనుమతి ఉందా అని అడిగారు. కాళేశ్వరం కమిషన్కు స్పష్టంగా అనుమతి ఉన్న విషయాన్ని అన్ని ఆధారాలతో సమర్పించడం జరిగింది. అన్నారం, సుందిళ్ల బ్యారేజీ లోకేషన్ మార్పుల గురించి అడిగారు. అది పూర్తిగా టెక్నికల్ నిర్ణయం. ఇంజనీర్ల డీటెయిల్ సర్వే ఆధారంగా బ్యారేజ్ లొకేషన్ మారింది. ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు తీసుకునే నిర్ణయమని చెప్పాను. దేశంలో ఇలా అనేక ప్రాజెక్టుల నిర్మాణ విషయంలో జరుగుతుంది వాటికి సంబంధించిన ఆధారాలు కూడా కమిషన్కి సమర్పించడం జరిగిందన్నారు హరీశ్రావు.
ఇక ఈ ప్రాజెక్టులో రిజర్వాయర్లకు కెపాసిటీ ఎంత అని అడిగారు. 141 టీఎంసీల సామర్థ్యంతో రిజర్వాయర్ నిర్మించామని చెప్పడం జరిగింది. కాళేశ్వరంపై పిచ్చికూతలు కూస్తూ కూళేశ్వరం అని మాట్లాడుతున్నారు. కాళేశ్వరంలో 100 భాగాలు ఉన్నాయి. అన్ని ఇంటెక్ట్ ఉన్నాయి. కాళేశ్వరం ప్రాజెక్టులో… 3 బ్యారేజీలు, 15 రిజర్వాయర్లు, 19 సబ్ స్టేషన్లు, 21 పంప్ హౌస్లు, 203 కిలోమీటర్ల సొరంగాలు, 1531 కిలోమీటర్ల గ్రావిటీ కెనాల్స్, 98 కిలోమీటర్ల ప్రెజర్ మెయిన్స్, 141 టిఎంసీల స్టోరేజ్ కెపాసిటీ, 530 మీటర్ల ఎత్తుకు లిఫ్ట్, 240 టిఎంసీల నీటి వినియోగం.. పూర్తిగా ఇవన్నీ ఇంటాక్ట్ ఉన్నాయని హరీశ్రావు తెలిపారు.
ముఖ్యమంత్రి గంధమల్ల ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు. ఈ ప్రాజెక్టుకు నీళ్లు మల్లన్న సాగర్ నుంచి పోతాయి. మల్లన్న సాగర్ కాళేశ్వరం ప్రాజెక్టులో భాగం. హైదరాబాద్ మూసీ సుందరీకరణకు మల్లన్న సాగర్ నుంచి నీళ్లు తరలిస్తామంటున్నారు. ఆ మల్లన్న సాగర్ కాళేశ్వరంలో అంతర్భాగం. అదేవిధంగా హైదరాబాద్కు తాగునీటిని మల్లన్న సాగర్ నుంచి ఇస్తామంటున్నారు అది కాళేశ్వరంలో భాగం కాదా. మల్లన్న సాగర్ పై ఆధారపడ్డ గంధమల్లకు టెండర్లు పిలిచి శంకుస్థాపన చేస్తారు. మరో పక్క కాళేశ్వరం కూలింది అని దుష్ప్రచారం చేస్తారని హరీశ్రావు మండిపడ్డారు.