Harish Rao | హైదరాబాద్ : పార్టీ మారిన ఎమ్మెల్యేలు వాపస్ పోతారనీ డౌట్ వచ్చిందేమో.. అందుకే ఉప ఎన్నికలు రావని అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడిండు అని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు పేర్కొన్నారు. బీఆర్ఎస్ సభ్యులు సభ నుంచి వాకౌట్ చేసిన అనంతరం హరీశ్రావు మీడియాతో చిట్ చాట్ చేశారు.
సుప్రీంకోర్టులో పెండింగులో ఉన్న పార్టీ ఫిరాయింపుల విషయమై నిబంధనలకు విరుద్ధంగా సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో మాట్లాడారు. ముఖ్యమంత్రి సభలో మాట్లాడింది పూర్తిగా అసెంబ్లీ పార్లమెంట్ వ్యవస్థకు విరుద్ధం. కోర్టులో పెండింగులో ఉన్న విషయాలను చట్టసభల్లో మాట్లాడకూడదు అని కౌల్ అండ్ శకధర్ పార్లమెంటరీ ప్రొసీజర్ బుక్లో స్పష్టంగా ఉంది. కోర్టు పరిధిని అధిగమించి ముఖ్యమంత్రి మాట్లాడారు. రాష్ట్రంలో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల అనర్హతపై సుప్రీంకోర్టులో కేసు పెండింగులో ఉన్నా కూడా ముఖ్యమంత్రి అసెంబ్లీలో ఈ విషయంపై జడ్జిమెంట్ ఇచ్చాడు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు డిస్ క్వాలిఫై కారు, ఉప ఎన్నికలు రానే రావు అని జడ్జిమెంట్ ఇచ్చారు. ముఖ్యమంత్రి తన పరిధిని దాటి సుప్రీంకోర్టులో ఉన్న విషయం మీద మాట్లాడడం అసెంబ్లీ ప్రివిలేజ్ కిందకే వస్తుంది అని హరీశ్రావు పేర్కొన్నారు.
పాయింట్ ఆఫ్ ఆర్డర్ కింద నేను చెప్పే ప్రయత్నం చేస్తే మధ్యలో నా మైక్ కట్ చేశారు. ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుకు నిరసనగా సభ నుంచి వాకౌట్ చేశాం. సలహాలు ఇవ్వాలంటే ఇవ్వచ్చని ముఖ్యమంత్రి చెప్పారు, కానీ సలహాలు ఇవ్వడానికి మైక్ ఇవ్వాలని కోరితే ఇవ్వలేదు. ప్రతిపక్షం గొంతు నొక్క ప్రయత్నం చేస్తున్నారు. తక్కువ సభ్యులు ఉన్నవారికి మైక్ ఇస్తున్నారు, మాకు ఇవ్వడం లేదు అని హరీశ్రావు పేర్కొన్నారు.
బీఆర్ఎస్ ప్రభుత్వం బెట్టింగ్ యాప్స్ బ్యాన్ చేస్తూ వచ్చింది. కానీ, కాంగ్రెస్ ప్రభుత్వం 15 నెలల పాలనలో బెట్టింగ్ యాప్స్ని కంట్రోల్ చేయడంలో విఫలమైంది. రాష్ట్రంలో ప్రతి మూడు గంటలకు ఒక అత్యాచారం, ఆరు గంటలకు ఒక హత్య జరగుతున్నది. లా అండ్ ఆర్డర్ మెయిన్టైన్ చేయడంలో ప్రభుత్వం, ముఖ్యమంత్రి ఫెయిలయ్యారు. డీజీపీ అధికారికంగా విడుదల చేసిన లెక్క ప్రకారం గత సంవత్సరం కంటే 23 శాతం క్రైమ్ రేట్ పెరిగిందని చెప్పారు. 15 నెలల పాలనలో 9 కమ్యూనల్ రైట్స్ అయ్యాయి. ముఖ్యమంత్రిగా, హోంమంత్రిగా రేవంత్ రెడ్డి ఫెయిల్ అయ్యాడు. ఈ విషయాన్ని డీజీపీ ప్రకటించారు. నిన్న ఒకరోజే హైదరాబాద్లో రెండు అత్యాచార ఘటనలు, రెండు హత్యలు జరిగాయి. హైదరాబాద్లో 50 శాతం సీసీ కెమెరాలు పనిచేయడం లేదు. పెట్టిన సీసీ కెమెరాలును మెయింటైన్ చేయడంలో ఫెయిల్ అయ్యారు. పోలీసులకు ఆత్యాధునిక వాహనాలు మేం కొనిస్తే మీరు డీజిల్ పోయించే పరిస్థితిలో కూడా లేరు. పోలీస్ చరిత్రలో పోలీసు కుటుంబాలను పోలీసుల చేత అరెస్టు చేయించిన ఘనుడు సీఎం రేవంత్ రెడ్డి అని హరీశ్రావు విమర్శించారు.
అమనగల్లో ముఖ్యమంత్రి భూముల కోసం నాలుగు లైన్ల రోడ్లు రింగ్ రోడ్డు, రీజనల్ రింగ్ రోడ్ ఉండగా మరో రోడ్డు ఎందుకు? రూ. 5000 కోట్లు ఖర్చుపెట్టి 10 లైన్ల రోడ్డు ఎందుకు వేస్తున్నావ్. ఉద్యోగులకు పెన్షనర్లకు ఇవ్వడానికి డబ్బులు లేవని చెబుతూనే రూ. 5000 కోట్లతో అత్తగారి ఊరికి రోడ్లు వేస్తారా? రాష్ట్ర ప్రయోజనాల విషయం సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉంది కాబట్టే తెలంగాణను నంబర్ 1 గా నిలిపాము. స్టేట్ ఓన్ టాక్స్ రెవెన్యూ (SOTR) కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ నెంబర్ వన్. అదే విషయాన్ని రేవంత్ రెడ్డి ఈరోజు చెప్పాడు అని హరీశ్రావు తెలిపారు.
జానారెడ్డి గారిని ఆదర్శంగా తీసుకోండి అన్నారు సీఎం. ఎమ్మెల్యేల నియోజకవర్గ అభివృద్ధి కోసం ఏసీడీపీ నిధులు ఇవ్వాలని కోరితే వెంటనే కేసీఆర్ వచ్చారు. మీరు కూడా ప్రతిపక్ష ఎమ్మెల్యేల నియోజకవర్గం అభివృద్ధి కోసం ఏసీడీపీ నిధులు ఇవ్వండి. ఆర్థిక మాంద్యం వల్ల రూ. 70 వేల కోట్లు గండి పడిందని సీఎం చెప్పాడు కానీ, ఈరోజు మాట మార్చి 95 శాతం రియలిస్టిక్ బడ్జెట్ అంటున్నాడు అని హరీశ్రావు ధ్వజమెత్తారు.
ప్రతిపక్షంలో ఉన్నప్పుడు భూములమ్మితే బొంద పెట్టడానికి కూడా స్థలం మిగలదు అని చెప్పి.. ఈరోజు అసెంబ్లీ సాక్షిగా భూముల అమ్మకాన్ని సమర్ధిస్తున్నారు. గచ్చిబౌలిలోని 400 ఎకరాలను బీఆర్ఎస్ ప్రభుత్వం కోట్లాడి కాపాడింది.. మీరు అధికారంలోకి వచ్చాక కోర్టు తీర్పు వచ్చింది. గ్రోక్లో బెస్ట్ సిఎం ఎవరు అని అడిగితే కేసీఆర్ అని చెపుతున్నది అని హరీశ్రావు తెలిపారు.