Harish Rao | కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని వర్గాలను విజయవంతంగా మోసం చేసిందని.. విజయోత్సవాలను కాకుండా అపజయోత్సవాలు నిర్వహించాలంటూ మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు సెటైర్లు వేశారు. రేవంత్ రెడ్డి వరంగల్ వేదికగా అన్ని వర్గాల ప్రజలకు క్షమాపణ చెప్పాలని.. వరంగల్ డిక్లరేషన్, మహిళలకు ఇచ్చిన హామీలు ఇప్పటికైనా అమలు చేయాలని డిమాండ్ చేశారు. పది నెలల్లో రాష్ట్రాన్ని పదేళ్ల వెనక్కి తీసుకువెళ్లారని.. ‘ఎవరనుకున్నరు ఇట్లవునని.. ఎవరనుకున్నరు ఇట్లవునని’ ప్రజాకవి కాళోజీ నినదించినట్లు కాంగ్రెస్ చేతిలో ప్రజలు దగాపడ్డారన్నారు. రైతులు దారుణంగా మోసపోయారని ఆరపించారు. ఆ వైఫల్యాల నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకు, అపజయాలను కప్పిపుచ్చుకునేందుకు వరంగల్ వేదికగా విజయోత్సవాలు జరుపుకోవడం సిగ్గుచేటన్నారు.
ఏం సాధించారని సంబురాలు జరుపుకుంటున్నారు రేవంత్ రెడ్డి? అంటూ ప్రశ్నించారు. ఇదే వరంగల్ వేదికగా ఇచ్చిన రైతు డిక్లరేషన్ కు ఏడాది అయినా అతీగతీ లేదని విమర్శించారు. డిక్లరేషన్లో చెప్పిన మొట్టమొదటి హామీ రూ.2లక్షల రుణమాఫీ ఇంకా పూర్తి చేయలేదన్నారు. రైతులు, కౌలు రైతులకు ఇస్తామన్న రూ.15వేల భరోసా దిక్కులేదని.. ఉపాధిహామీ రైతు కూలీలకు ఏడాదికి ఇస్తాన్న 12వేలు ఇవ్వనేలేదన్నారు. పది రకాల పంటలకు ఇస్తామన్న బోనస్ బోగస్ చేశారని విమర్శించారు. ఆనాడు మీరు ఇచ్చిన తొమ్మిది హామీల్లో ఏ ఒక్కటి అమలు చేయలేదన్నారు. ఇందుకేనా మీ వరంగల్ విజయోత్సవ సభ రేవంత్ రెడ్డి? అంటూ నిలదీశారు. కాంగ్రెస్ పది నెలల పాలనలో రాష్ట్రాభివృద్ధి పదేండ్ల వెనక్కి వెళ్లిందని.. కేసీఆర్ పాలనలో అద్భుతంగా పురోగమించిన తెలంగాణ, నేడు తిరోగమనం బాట పట్టిందని గుర్తు చేశారు.
అన్ని వర్గాల ప్రజలు రోడ్ల మీదకు వచ్చి నిరసనలు తెలియజేసే దుస్థితి నెలకొందన్నారు. వద్దురో నాయనా కాంగ్రెస్ పాలన అంటూ పాటలు పాడుకుంటున్న పరిస్థితి ఉందన్నారు. పురుగుల్లేని భోజనం కోసం గురుకుల పిల్లలు, స్కాలర్ షిప్పుల కోసం విద్యార్థులు.. ఉద్యోగాల కోసం నిరుద్యోగులు.. రుణమాఫీ, రైతు బంధు కోసం రైతన్నలు ఎదురుచూస్తున్నారు. జీతాల కోసం ఆశాలు, అంగన్ వాడీలు.. డీఏ, పీఆర్సీ కోసం ప్రభుత్వ ఉద్యోగులు.. నిధులు విడుదల చేయాలంటూ గ్రామ పంచాయతీ సిబ్బంది నిరీక్షిస్తున్నారన్నారు. ఫార్మా కంపెనీలను వ్యతిరేకిస్తూ పల్లె ప్రజలు.. ఇండ్లు కూలగొట్టొద్దని హైడ్రా బాధితులు.. సమస్యలు పరిష్కరించాలంటూ పోలీసులు.. పింఛన్లు పెంచాలంటూ వృద్ధులు.. బడిలో చదువుకునే పిల్లల నుంచి పింఛన్లు అందుకునే అవ్వాతాతల వరకు అందర్నీ సక్సెస్ ఫుల్గా రోడ్ల మీదకు తెచ్చావంటూ విమర్శించారు. కేసీఆర్ పదేళ్ల కాలంలో అన్ని వర్గాలను కడుపులో పెట్టుకొని కాపాడుకుంటే, పది నెలల పాలనలో నువ్వు అందరి కడుపు కొట్టావని.. నమ్మి ఓటేసినందుకు నట్టేట ముంచినవ్.. మీరు జరుపుకోవాల్సింది విజయోత్సవాలు కాదు రేవంత్ రెడ్డి అంటూ చురకలంటించారు.
సక్సెస్ ఫుల్గా ప్రజలను మోసం చేసినందుకు అపజయోత్సవాలు జరుపుకోవాలన్నారు. ఏడాది కావొస్తున్నదని.. ఇప్పటికైనా కళ్లు తెరవాలన్నారు. అద్భాతాలు చేసామనే భ్రమ నుంచి బయటపడి ఇచ్చిన హామీలు అమలు చేయండన్నారు. గోబెల్స్ ప్రచారాలు పక్కన బెట్టి పరిపాలన మీద దృష్టి సారించాలన్నారు. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన ఆరు గ్యారెంటీలు, 420 హామీలు అమలు చేయాలని.. వైఫల్యాలను గుర్తించి మోసం చేసినందుకు వరంగల్ వేదికగా ప్రజలకు క్షమాపణలు చెప్పాలని బీఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేశారు. మాట ఇచ్చాం, పూర్తి చేసామని మహిళలకు ఇచ్చిన హామీల పట్ల కోట్లు వెచ్చించి ప్రకటనలు జారీ చేసినంత మాత్రాన అబద్దాలు నిజమైపోవని.. ఆరు గ్యారెంటీల్లో మొదటి హామీగా మహిళలకు చెప్పిన రూ. 2500 ఎప్పటి నుంచి ఇస్తారో, కల్యాణ లక్ష్మి పథకం కింద ఇచ్చే తులం బంగారం ఎప్పటి నుంచి ఇస్తారో.. స్వయం సహాయక సంఘాలకు షరతులు లేకుండా వడ్డీ లేని రుణాలకు సంబంధించిన కొత్త ఉత్తర్వులు ఎప్పుడు విడుదల చేస్తారో చెప్పాలని, తేదీలు ప్రకటించాలని హరీశ్రావు డిమాండ్ చేశారు.