Harish Rao | హైదరాబాద్ : నాడైనా నేడైనా తెలంగాణ ప్రయోజనాల ముందు పదవులు బీఆర్ఎస్కు తృణప్రాయం అని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు పేర్కొన్నారు. బనకచర్లతో ఏపీ అప్పనంగా నీళ్ళు దోచుకుపోతా అంటే చూస్తూ ఊరుకోం అని ఆయన హెచ్చరించారు.
పోలవరం, పోతిరెడ్డిపాడు, పులిచింతల వంటి ఏపీ అక్రమ ప్రాజెక్టులను నిరసిస్తూ 20 ఏళ్ల క్రితం ఇదే రోజున (04.07.2005) మంత్రి పదవులకు రాజీనామాలు చేశాం. కేసీఆర్ ఆదేశానుసారం.. ఉమ్మడి రాష్ట్రంలోనే తెలంగాణ నీటి హక్కుల కోసం పదవులను గడ్డి పోచలుగా భావించి వదులుకున్నం. నీళ్లు, నిధులు, నియామకాలు నినాదంతో కొట్లాడి సాధించుకున్న తెలంగాణలో.. ఆంధ్రప్రదేశ్ బనకచర్ల పేరిట గోదావరి నీళ్ల దోపిడి చేస్తానంటే చూస్తూ ఊరుకుంటామా? అని హరీశ్రావు నిలదీశారు.
నాడైనా, నేడైనా తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలు దెబ్బ తీసే ఏ కుట్రలనైనా బీఆర్ఎస్ పార్టీ సహించదు. పదవులకు రాజీనామాలు చేయడం మాత్రమే కాదు, పేగులు తెగేదాకా కొట్లాడుతం. తెలంగాణకు అన్యాయం జరగకుండా కాపలా ఉంటం. కంటికి రెప్పలా ఉండి కాపాడుకుంటం. ప్రాంతేతరుడు ద్రోహం చేస్తే.. పొలిమేర దాకా తరిమికొడతాం.. ప్రాంతంవాడే ద్రోహం చేస్తే ప్రాణంతోనే పాతర వేస్తం అని హరీశ్రావు హెచ్చరించారు. జై తెలంగాణ.. జై కేసీఆర్.. అని హరీశ్రావు నినదించారు.