Harish Rao | కాంగ్రెస్ బోనస్ పెద్ద బోగస్ అని.. సర్కారు మరో ఎన్నికల హామీని తుంగలో తొక్కిందని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు మండిపడ్డారు. నిరుద్యోగులకు నెలకు రూ.4వేల భృతి ఇస్తామని హామీ ఇచ్చి, తాము ఆ మాట అనలేదని అసెంబ్లీ సాక్షిగా అబద్ధాలు చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం, నేడు వడ్లకు బోనస్ ఇచ్చే విషయంలో పచ్చి అబద్ధాలాడి రైతులను మోసం ఆరోపించారు. రైతులు పండించిన వరి పంటకు క్వింటాకు రూ.500 బోనస్ ఇచ్చి కొనుగోలు చేస్తామని కాంగ్రెస్ ఆరు గ్యారంటీల్లో భాగంగా హామీ ఇచ్చిందని.. తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత మాట మారుతుందని విమర్శించారు.
రాష్ట్రవ్యాప్తంగా రైతులు తాము పండించిన పంటను అమ్మకానికి సిద్ధపడి బోనస్ కోసం ఎదురు చూస్తుండగా.. వారందరి ఆశలు అడియాసలు చేస్తూ కేవలం సన్న వడ్లకు మాత్రమే బోనస్ ఇస్తామని.. అది కూడా వచ్చే సీజన్ నుంచి ఇస్తామని మంత్రులు ప్రకటించడం అత్యంత బాధాకరమన్నారు. తెలంగాణ రాష్ట్రంలో దాదాపు 90శాతం దొడ్డు రకం వడ్లనే పండిస్తారని.. పది శాతం పండే సన్న వడ్లకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉంటుందన్నారు. సన్న వడ్లకు మద్దతు ధరకంటే చాలా అధికంగా మార్కెట్లో ధర వస్తుందని తెలిపారు. కానీ, దొడ్డు రకం బియ్యానికే గిట్టుబాటు ధర రాదన్నారు. కాబట్టి బోనస్ ఇవ్వాల్సింది దొడ్డు రకం వడ్లకేనన్నారు. అలా కాకుండా కేవలం సన్న రకాలకే బోనస్ ఇస్తాం.. అదీ వచ్చే సీజన్ నుంచి ఇస్తామనడం రైతులను దగా చేయడమేనన్నారు. తాజాగా మంత్రుల ప్రకటనతో రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వానికి రైతుల సంక్షేమంపై, వ్యవసాయాభివృద్ధిపై ఏమాత్రం చిత్తశుద్ధి లేదని స్పష్టమైపోయిందన్నారు.
ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అధికారంలోకి రావాలనే దురుద్దేశంతో ఇచ్చినవే తప్ప రైతుల మేలు కోసం చేసే కార్యక్రమాలు కావని తేలిపోయిందన్నారు. ఎకరానికి రూ.15వేల రైతు భరోసా సాయం ఇస్తామని, వ్యవసాయ కూలీలకు రూ.12వేల చొప్పున ఆర్థిక సాయం చేస్తామనే హామీలను కూడా ప్రభుత్వం ఇప్పటి దాకా అమలు చేయని విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు. రూ.2లక్షల రుణమాఫీ గురించి కూడా వాయిదాలు పెట్టడమే తప్ప నేటి వరకు అమలు చేసింది లేదన్నారు. కేవలం సన్న వడ్లకే బోనస్ ఇస్తామనే ప్రభుత్వ నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఈ సీజన్ నుంచే అన్ని రకాల వడ్లకు రూ.500 చొప్పున బోనస్ చెల్లించాలని రైతుల పక్షాన ప్రభుత్వాన్ని కోరుతున్నానన్నారు.