Harish Rao : రాష్ట్ర ప్రభుత్వం దాచిపెట్టిన అన్ని జీవోలను నాలుగు వారాలలోపు బహిర్గతం చేయాలని, పబ్లిక్ డొమైన్లో ఉంచాలని తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పు సోకాల్డ్ ప్రజా ప్రభుత్వానికి చెంపపెట్టు లాంటిదని మాజీ మంత్రి హరీశ్ రావు అన్నారు. రేవంత్రెడ్డి తనది ప్రజా ప్రభుత్వం అని చెప్పుకోవడం కాదని, చీకటి జీవోల మాటున దొంగచాటుగా ఏం చేస్తున్నాడో బహిర్గతం చెయాలని ఆయన ఎక్స్ వేదికగా డిమాండ్ చేశారు.
ప్రజాపాలన అని చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ జీవోలు దాస్తూ డ్రామాలు చేస్తున్నదని హరీశ్రావు విమర్శించారు. ఆర్టీఐ సమాధానం ఆధారంగా బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు ఎర్రోళ్ల శ్రీనివాస్ హైకోర్టులో వేసిన పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ (PIL) తో ఆ డ్రామాలు బయటపడబోతున్నాయని అన్నారు. 2023 డిసెంబర్ 7 నుంచి 2025 జనవరి 1 వరకు అంటే మొత్తం 13 నెలల్లో ప్రభుత్వం 19,064 జీవోలు జారీ చేసిందని, వాటిలో కేవలం 3,290 జీవోలు మాత్రమే పబ్లిక్ డొమైన్లో ఉంచడంలో అంతర్యం ఏమిటని ప్రశ్నించారు.
ఒక్క ఏడాదిలో 15,774 జీవోలు అంటే 82 శాతం జీవోలను దాచిపెట్టి ప్రభుత్వం ఏం చేస్తున్నట్లని హరీశ్రావు నిలదీశారు. ‘రేవంత్ రెడ్డీ ఇదేనా మీరు చెప్పుకుంటున్న ప్రజా ప్రభుత్వం?’ అని ప్రశ్నించారు.