Harish Rao | హైదరాబాద్ : ఎస్ఎల్బీసీ సొరంగం కుప్పకూలి నేటికి సరిగ్గా నెలరోజులు అవుతుందని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు పేర్కొన్నారు. ఆ విషాద ఘటనలో చిక్కుకున్నవారు ఏమయ్యారో ఇప్పటికీ తెలియని పరిస్థితి నెలకొందని తెలిపారు.
ఒకరి మృతదేహం వెలికి తీయడం తప్ప, మిగతా ఏడుగురి జాడ కనుగొనడంలో ఎలాంటి పురోగతి లేకపోవడం శోచనీయం. పొట్టకూటి కోసం వచ్చి ప్రమాదంలో చిక్కుకున్న వారి గురించి ఆలోచిస్తే గుండె తరుక్కుపోతున్నది. వారి కుటుంబాల ఆవేదన వర్ణనాతీతం. ఎందుకింత జాప్యం జరుగుతున్నది. కారణాలు అంతు పట్టడం లేదు అని హరీశ్రావు పేర్కొన్నారు.
సొరంగం కూలడం వెనుక, ప్రమాదంలో చిక్కుకున్న వారిని గుర్తించి ఇప్పటికీ బయటకి తీసుకు రాకపోవడం వెనుక ఈ ప్రభుత్వం ఘోర వైఫల్యం ఉంది. భూ భౌతిక శాస్త్రవేత్తల హెచ్చరికలు పెడచెవిన పెట్టి, మొండిగా టన్నెల్ పనులు ప్రారంభించారు.
ప్రమాదాన్ని ముందుగా గుర్తించి కూలీలు అప్రమత్తం చేసినా, పట్టించుకోలేదు. రాజకీయ ప్రయోజనాల కోసం తీసుకున్న తొందరపాటు నిర్ణయం 8 నిండు ప్రాణాలను మృత్యుకుహరంలోకి నెట్టింది. జరిగిన ప్రమాదానికి, బాధితులు అనుభవిస్తున్న క్షోభకు, వారి కుటుంబాలు పడుతున్న తీవ్ర వేదనకు ముఖ్యమంత్రి బాధ్యత వహించాలి అని హరీశ్రావు డిమాండ్ చేశారు.
తమ వాళ్లు ప్రాణాలతో ఉన్నారో లేరో తెలియక, వారి కుటుంబాలన్నీ కళ్లు కాయలు కాసేలా ఎదురు చూస్తున్నాయి. మా వాళ్లు బతికి ఉన్నారా.. మరణించారా? రాష్ట్ర ప్రభుత్వమే తేల్చాలని వారంతా ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. మంత్రులు చెప్పిన డెడ్ లైన్లు, క్యాలెండర్లో డేట్లు మారినయి తప్ప, సహాయక చర్యలో చెప్పుకోదగ్గ పురోగతి లేనే లేదు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన స్పందించాలి. గల్లంతైన వారి జాడ కనుక్కోవాలి. నెల రోజులుగా ఎస్ఎల్బీసీ సొరంగం వద్ద రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సహాయక చర్యలపై పూర్తి వివరాలు బయట పెట్టాలని డిమాండ్ చేస్తున్నామని హరీశ్రావు పేర్కొన్నారు.