హైదరాబాద్, జూన్ 27 (నమస్తే తెలంగాణ): గోల్కొండ బడా బజార్ మైనార్టీ జూనియర్ కాలేజీలో ఓ విద్యార్థిని బిడ్డకు జన్మనిచ్చి, శిశువును కిటికీ నుంచి బయటకు విసిరేసి ప్రాణాలు తీసిన ఘటన అత్యంత బాధాకరమని మాజీ హోం మంత్రి మహమూద్ అలీ ఆవేదన వ్యక్తం చేశారు. శనివారం తెలంగాణ భవన్లో ఆయన మాట్లాడారు. సభ్యసమాజం సిగ్గుపడే ఈ వ్యవహారం కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమని దుయ్యబట్టారు. ఈ అవమానవీయ ఘటనపై హోంమంత్రి రేవంత్రెడ్డి, డీజీపీ సరిగ్గా విచారణ జరిపి బాధ్యులను కఠినంగా శిక్షించాలని కోరారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత గురుకులాలను నిర్వీర్యం చేస్తున్నదని ఆరోపించారు.
కేసీఆర్పై కక్షతో నిరుపేద విద్యార్థులను ఇబ్బందులు పెట్టడం ఎంతవరకు సమంజసమని మహమూద్ అలీ ప్రశ్నించారు. గురుకులాల నిర్వహణను ప్రభుత్వం గాలికొదిలేసిందని దుయ్యబట్టారు. కేసీఆర్ పేద, మైనారిటీ పిల్లలకు నాణ్యమైన విద్యనందించే లక్ష్యంతో రూ.3,500 కోట్లు వెచ్చించి రాష్ట్రవ్యాప్తంగా 204 గురుకుల విద్యాలయాలు ఏర్పాటు చేశారని, కానీ కాంగ్రెస్ ప్రభుత్వం రెండున్నరేండ్ల్ల పాలనలో గురుకులాలను అస్తవ్యస్తం చేసిందని, విద్యార్థినులు పాఠశాలల్లోనే ప్రసవించే పరిస్థితులు వచ్చాయని ధ్వజమెత్తారు. విద్యార్థిని గర్భందాల్చిన విషయాన్ని తొమ్మిది నెలలుగా గుర్తించకపోవడం సర్కార్ నిర్లక్ష్యానికి అద్దంపడుతున్నదని, బాధ్యులైన వార్డె న్, ప్రిన్సిపాల్, వైద్యాధికారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సమావేశంలో బీఆర్ఎస్ మైనారిటీ నాయకులు రహీంఉల్లాఖాన్ నియాజీ, అర్షద్ అలీఖా న్, అబ్దుల్ కలీం తదితరులు ఉన్నారు.