KCR | హైదరాబాద్, ఏప్రిల్ 28 (నమస్తే తెలంగాణ): “కేంద్రంలోని బీజేపీ గోదావరిని ఎత్తుకుపోతానంటున్నది. చేతగాని సీఎం రేవంత్రెడ్డి నోరు మూసుకుని కూర్చున్నడు. మరి ఆ రెండు పార్టీలకు ఓటెందుకెయ్యాలె. ఎన్నో హామీలిచ్చి గెలిచిన ఐదునెలల్లోనే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను మోసం చేసింది. ప్రభుత్వం మెడలు వంచి హామీలను అమలు చేయిస్తాం. తెలంగాణ ప్రజానీకం తరపున కొట్లాడేది బీఆరెస్సే. అది నేనే” అని బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ పేర్కొన్నారు.
కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చే పరిస్థితి లేదని, వచ్చేది హంగ్ ప్రభుత్వమే కాబట్టి.. ఎక్కువమంది బీఆర్ఎస్ ఎంపీలను గెలిపిస్తే కీలక పాత్ర పోషించే అవకాశముంటుందని వివరించారు. బస్సుయాత్రలో భాగంగా ఐదో రోజు ఆదివారం వరంగల్లో నిర్వహించిన రోడ్ షోలో కేసీఆర్ మాట్లాడుతూ కడియం శ్రీహరిపై నిప్పులు చెరిగారు. మూడు నెలల్లో ఆయన రాజకీయ జీవితానికి శాశ్వత సమాధి తప్పదని హెచ్చరించారు.
రాజకీయాల కోసం గోదావరి పణం
కేంద్రంలోని బీజేపీ ఇచ్చిన ఏ ఒక్క హామీ నెరవేరలేదని, 18 లక్షల ఉద్యోగాలు ఖాళీ ఉంటే ఒక్క పోస్టును కూడా భర్తీ చేయలేదని కేసీఆర్ విమర్శించారు. “మనకున్నది ఒకే ఒక్క నది. గోదావరి నది మన బతకుదెరువు. కేంద్రం తన రాజకీయ ప్రయోజనాల కోసం తెలంగాణ గొంతుకోసి గోదావరిని ఎత్తుకుపోయి తమిళనాడుకు ఇస్తా, కర్ణాటకకు ఇస్తా అని మాట్లాడుతున్నది. ఎన్నికల సమయంలో మోదీ రాష్ట్ర ప్రభుత్వానికి నోటిఫికేషన్ పంపారు.
ప్రాణం పోయినా ఇవ్వబోమని రాష్ట్ర ప్రభుత్వం పంచాయితీ పెట్టాలె. మేమున్నప్పుడు అదే చేసినం. చేతగాని రేవంత్ ప్రభుత్వం మాత్రం నోరుమూసుకుని పడున్నది. ఏం మత్లబు ఉంది ఇండ్ల? ఇయ్యాల ఈ ముఖ్యమంత్రేమో కుయ్యి లేదు. కయ్యిలేదు. ఏమనుకోవాలె దీన్ని. ఇంతకుముందే కృష్ణానదిని తీసుకుపోయి కేఆర్ఎంబీకి అప్పగించిండు. ఇయ్యాల గోదావరిని ఎత్తుకుని పోతామంటే మూతి ముడుసుకుని కూర్చున్నడు” అని రేవంత్రెడ్డిపై కేసీఆర్ మండిపడ్డారు.
వరంగల్ తెలంగాణ వైభవ ప్రతీక
తెలంగాణ వైభవానికి ప్రతీక అయిన వరంగల్ మట్టితో, చరిత్రతో తనకు విడదీయరాని బంధముందని కేసీఆర్ గుర్తుచేసుకున్నారు. బీఆర్ఎస్ వరంగల్ ఎంపీ అభ్యర్థి మారేపల్లి సుధీర్కుమార్కు మద్దతుగా హనుమకొండలో బస్సు యాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన కార్నర్ మీటింగ్లో ఆయన మాట్లాడుతూ సుధీర్కుమార్ను గెలిపించాలని కోరారు. 42 డిగ్రీల ఎండను సైతం లెక్కచేయకుండా కార్నర్ మీటింగ్ వచ్చారంటూ ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు.
నాడు ఉద్యమ సమయంలో ఓరుగల్లు పోరుగల్లుగా మారబట్టే తెలంగాణ వచ్చిందని గుర్తుచేశారు. తెలంగాణ కోసం 1969 నుంచి విరామం లేకుండా, రాజీపడకుండా పోరాడిన కాళోజీ, జయశంకర్ను తలచుకుంటే ఉద్వేగం, ఆవేశం వస్తుందని పేర్కొన్నారు. సమైక్య పాలనతో వరంగల్ వెనకబడిందని, అజంజాహీ మిల్లు ఆగమైందని ఆవేదన వ్యక్తం చేశారు. 20 ఏండ్లుగా తనతో ఉన్న యువకుడు, విద్యావంతుడు అయిన సుధీర్కుమార్ను గెలిపించాలని కోరారు.
బీఆర్ఎస్ హయాంలో వరంగల్ అన్ని రంగాల్లోనూ అభివృద్ధి చెందిందని, వరంగల్ నడిబొడ్డున 24 అంతస్థుల్లో మల్టీ సూపర్ స్పెషాలిటీ దవాఖాన కట్టుకున్నామని, కాళోజీ హెల్త్ యూనివర్సిటీ పెట్టుకున్నామని గుర్తుచేశారు. పరకాలలో మాజీ ఎమ్మెల్యే ధర్మారెడ్డి ఆధ్వర్యంలో కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ తెచ్చుకున్నామని పేర్కొన్నారు. ములుగు, భూపాలపల్లి, నర్సంపేట, మహబూబాబాద్, జనగామలో మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేసుకున్నామని వివరించారు.
లంచం కోసం అభివృద్ధిని ఆపేశారు
తెలంగాణ వచ్చాక భూముల ధరలు పెరిగితే ఇప్పుడు మొత్తం పడిపోయాయని కేసీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. రియల్ ఎస్టేట్లో రంగంలో వేలాదిమంది రోడ్డున పడ్డారని తెలిపారు. హైదరాబాద్ వంటి నగరాల్లో ఐదు నెలలుగా పర్మిషన్లు ఇవ్వడం లేదని పేర్కొన్నారు. తాము టీఎస్ బీపాస్ను తీసుకొచ్చి అప్లికేషన్ పెట్టిన 21 రోజుల్లోనే పర్మిషన్ ఇచ్చేవాళ్లమని గుర్తు చేశారు.
ఈ ముఖ్యమంత్రి, మంత్రి వర్గం మాత్రం బిల్డింగ్లు కడితే స్కేర్ఫీట్కు ఇంత చొప్పున పార్టీకి లంచమివ్వాలని బిల్డర్లను అడుగుతున్నారని ఆరోపించారు. దీనికోసం మొత్తం అభివృద్ధిని ఆపేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పూర్తయిన బిల్డింగ్లకు ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ కూడా ఇవ్వడం లేదని, రేపో, ఎల్లుండో ఈ బండారమంతా బయటపెడతానని తెలిపారు.
మైనార్టీలకు గురుకులాలు
తమ పదేండ్ల పాలనలో తెలంగాణను లౌకిక రాష్ట్రంగా తీర్చిదిద్దామని కేసీఆర్ తెలిపారు. మైనార్టీల అభ్యున్నతికి అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేశామని చెప్పారు. మైనార్టీ సంక్షేమం కోసం రూ.12 వేలకోట్లు ఖర్చు చేశామని, మైనార్టీ గురుకులాలను ఏర్పాటుచేశామని, దేశంలోనే తొలిసారి ఇమామ్, మౌజమ్లకు గౌరవ వేతనం ఇచ్చామని గుర్తుచేశారు. బీజేపీ సర్కారు తన బిడ్డను జైలులో పెట్టిందని, అయినా భయపడేది లేదని తేల్చి చెప్పారు. ఇప్పుడు బీఆర్ఎస్, బీజేపీ మధ్యనే పోటీ కొనసాగుతున్నదని, కాంగ్రెస్కు ఓటేస్తే బీజేపీ గెలిచే అవకాశం ఉన్నదని హెచ్చరించారు. ఎన్నికల్లో బీఆర్ఎస్ను ఆదరించి, కారు గుర్తుకు ఓటేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు.
విద్వేషం నింపడమే బీజేపీ పని
బీజేపీ చాలా ప్రమాదరకమైన పార్టీ అని, విద్వేషం నింపడం, పంచాయితీలు పెట్టుడు తప్ప దానికి మరో పనిలేదని కేసీఆర్ ఆరోపించారు. బీజేపీ ఎజెండాలో ప్రజలకు సుఖాలుండవని పేర్కొన్నారు. ఈ రాష్ట్ర భవిష్యత్తు యువకులదేనని, కాబట్టి వారంతా ఆలోచించి ఈ అంశాలపై బస్తీల్లో, ఊర్లలో చర్చ పెట్టాలని సూచించారు. విదేశాల నుంచి నల్లధనం తెచ్చి ఇంటికి రూ. 15 లక్షలు ఇస్తానని మోదీ పదేండ్ల క్రితం చెప్పారని, ఇప్పటికీ అది అమలు కాలేదని మండిపడ్డారు. కాజీపేటకు రావాల్సిన కోచ్ ఫ్యాక్టరీని మోదీ తన సొంతరాష్ట్రం గుజరాత్కు ఎత్తుకెళ్లారని మండిపడ్డారు.
ఇక్కడొక మనిషికి టికెట్ ఇచ్చినం. ఉపముఖ్యమంత్రి పదవి ఇచ్చినం. ఎందుకు మారిపోయిండు పార్టీ. కడియం శ్రీహరి మోసం చేసి తన రాజకీయ జీవితాన్ని శాశ్వతంగా సమాధి చేసుకున్నడు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం 3 నెలల్లో స్టేషన్ఘన్పూర్ నియోజకవర్గానికి బై ఎలక్షన్ రాక తప్పదు. రాజయ్య ఎమ్మెల్యే గాక తప్పదు. ఇది రాసిపెట్టుకోండి. మూడునెలల్లో జరగబోయే సత్యం ఇది. ద్రోహం చేస్తే చెప్పే గుణపాఠం అదే. – కేసీఆర్
సీఎంకు తెలంగాణ చరిత్ర తెల్వదు
మన ముఖ్యమంత్రికి తెలంగాణ చరిత్ర తెల్వదు, భూగోళం తెల్వదు. ఇటీవల ఎక్కడో మాట్లాడుతూ కృష్ణానదిని తానే కట్టానని అన్నాడని, ప్రపంచంలో ఎవరైనా నదిని కడతారా? అని ఎద్దేవా చేశారు. వరంగల్కు కాళేశ్వరం నీళ్లే రాలేదని అంటున్నాడని, మరి నర్సంపేట భూపాలపల్లి, మహబూబాబాద్, డోర్నకల్, పరకాల, పాలకుర్తి, వర్ధన్నపేటకు ఎక్కడి నుంచి నీళ్లు వచ్చాయని ప్రశ్నించారు. తెలంగాణ సాధించుకున్నాక కాళేశ్వరం కడితే వరంగల్కు నీళ్లు వచ్చాయని వివరించారు.
హైదరాబాద్ వంటి నగరాల్లో ఐదు నెలలుగా పర్మిషన్లు ఇవ్వడం లేదు. మేము టీఎస్ బీపాస్ను తీసుకొచ్చి అప్లికేషన్ పెట్టిన 21 రోజుల్లోనే పర్మిషన్ ఇచ్చేవాళ్లం. ఈ ముఖ్యమంత్రి, మంత్రి వర్గం మాత్రం బిల్డింగ్లు కడితే స్కేర్ఫీట్కు ఇంత చొప్పున పార్టీకి లంచమివ్వాలని బిల్డర్లను అడుగుతున్నరు.
– కేసీఆర్
14-15 సీట్లు వస్తే మనమే కీలకం
ఈ ఎన్నికల్లో మోదీకి 280 సీట్లు కూడా దాటే పరిస్థితి లేదని వార్తలు వస్తున్నాయని, అదే జరిగితే హంగ్ ఏర్పడుతుందని కేసీఆర్ పేర్కొన్నారు. బీఆర్ఎస్కు 14-15 సీట్లు వస్తే అప్పుడు కేంద్రంలో మనం కీలక పాత్ర పోషించే అవకాశం ఉంటుందని తెలిపారు. గోదావరి, కృష్ణానదిని కాపాడుకోవాలన్నా, మన నిధులను రాబట్టుకోవాలన్నా, ప్రాజెక్టులకు జాతీయహోదా రావాలన్నా, నిరుద్యోగ సమస్య తీరాలన్నా, మన బతుకులు బాగుపడాలన్నా కచ్చితంగా బీఆర్ఎస్ అభ్యర్థులు గెలవాలని పేర్కొన్నారు.
తెలంగాణకు అదే క్షేమమని, ప్రజలు ఆలోచించాలని కోరారు. గోదావరిని ఎత్తుకుపోతానన్న బీజేపీకి కానీ, హామీలిచ్చి మోసం చేసిన కాంగ్రెస్కు కానీ ఓటెందుకేయాలని ప్రశ్నించారు. “కాంగ్రెస్ మోసాలపై కొట్లాడదామా? యుద్ధం చేద్దామా? గోదావరిని కాపాడుకుందామా? కృష్ణాను కాపాడుకుందామా? మళ్లీ బీఆర్ఎస్ సర్కార్ తరహాలో రైతుబంధు ఇచ్చుకుందా మా?” అన్న కేసీఆర్ ప్రశ్నకు ప్రజలు చెయ్యెత్తి ‘అవును’ అని నినదించారు. స్పందించిన కేసీఆర్.. అవన్నీ జరగాలంటే వరంగల్ ఎంపీగా సుధీర్కుమార్ను గెలిపించాలని కోరారు.
ఏరికోరి తెచ్చుకుంటే ఎగిరెగిరి తన్నిండు
ఏరికోరి తెచ్చుకున్న మొగుడు ఎగిరెగిరి తన్నినట్టు.. కాంగ్రెస్ అడ్డగోలు హామీలకు మోసపోయి ఓట్లు వేస్తే నాలుగైదు నెలల్లో తెలంగాణకు జబ్బు వచ్చిందని కేసీఆర్ పేర్కొన్నారు. కరెంటు ఎందుకు పోతున్నదని, సాగునీళ్లు ఎక్కడికి పోయాయని, పంటలెందుకు ఎండుతున్నాయని, తాగునీటికి కరువు ఎందుకొచ్చిందని ప్రశ్నించారు. గత పదేండ్లలో ఎన్నడూ వీటిని ఎరుగమని చెప్పారు. ఈ ప్రభుత్వం ఒక్కటంటే ఒక్క హామీ కూడా నెరవేర్చలేదని మండిపడ్డారు. తాము రూ. 30 వేల కోట్లతో రుణమాఫీ చేశామని గుర్తుచేశారు. డిసెంబర్ 9న 10 గంటలకు రెండు లక్షల రుణమాఫీ చేస్తానని ముఖ్యమంత్రి చెప్పాడని, కానీ అమలు కాలేదని పేర్కొన్నారు.