హైదరాబాద్, ఏప్రిల్ 17 (నమస్తే తెలంగాణ)/బోధన్: తన కొడుకుపై నమోదైన కేసులపై సీబీఐ లేదా హైకోర్టు సిట్టింగ్ జడ్జితో సమగ్రంగా విచారణ జరిపించాలని బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ ప్రభుత్వాన్ని కోరారు. బుధవారం విడుదల చేసిన ఓ వీడియో ద్వారా ఆయన పలు అంశాలను వెల్లడించారు. వెస్ట్జోన్ డీసీపీ విజయ్కుమార్ తనపై, తన కుమారుడు రాహిల్పై కక్ష కట్టారని, చెయ్యని తప్పునకు నేరం అంటగడుతున్నారని తెలిపారు. మూడేండ్ల కిందటి జూబ్లీహిల్స్ కేసులో నేరం ఒప్పుకోకపోతే తన కొడుకును ఎన్కౌంటర్ చేస్తామంటూ డీసీపీ విజయ్కుమార్ బెదిరిస్తున్నారని ఆందోళన వ్యక్తంచేశారు. తన కుమారుడికి ఏదైనా హాని జరిగితే దానికి డీసీపీతోపాటు పంజాగుట్ట ఏసీపీ మోహన్కుమార్, జూబ్లీహిల్స్, పంజాగుట్ట పోలీసులే బాధ్యత వహించాల్సి ఉంటుందని షకీల్ ఆ వీడియోలో హెచ్చరించారు. ఆ రోజు తన కుమారుడు అసలు డ్రైవింగ్ చేయనేలేదని చెప్పారు. 21 ఏండ్ల యువకుడిపై 21 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారని, ఎకడైనా ఇంత దారుణం ఉంటుందా? అని ప్రశ్నించారు. సంఘటన జరిగినప్పుడు దుబాయ్లో ఉన్న తనపైనా కేసు పెట్టారని తెలిపారు. తాను చట్టప్రకారం పోరాడుతానని, చిన్నపిల్లలను టార్గెట్ చేస్తూ వారి భవిష్యత్తును నాశనం చేయొద్దని హితవు పలికారు.