యాదాద్రి భువనగిరి : యాదాద్రి కలెక్టరేట్లో ఈవీఎం, వీవీ ప్యాట్ల గోడౌన్ను రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి శశాంక్ గోయల్ బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా శశాంక్ గోయల్ మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో ఈవీఎం, వీవీ ప్యాట్ల కోసం కొత్తగా 22 గోడౌన్లు ఏర్పాటు చేశామన్నారు. 18 ఏండ్లు నిండిన వారందరూ తప్పనిసరిగా ఓటు నమోదు చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. మరణించిన ఓటర్ల పేర్లు తొలగించేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. గరుడ యాప్ ద్వారా బూత్ లెవల్ పని చేసేలా కార్యాచరణ రూపొందిస్తామన్నారు.
ఈ గోడౌన్ ప్రారంభం కంటే ముందుకు యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి వారిని శశాంక్ గోయల్ దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు ఆయనకు స్వామివారి ఆశీర్వచనం అందజేయగా, ఆలయ అధికారులు ప్రసాదం అందజేశారు. అనంతరం ఆయన ప్రధానాలయాన్ని పరిశీలించారు. ఆయన వెంట ఆర్డీవో భూపాల్ రెడ్డి, ఆలయ ఏఈవో శ్రవణ్ కుమార్ తదితరులు ఉన్నారు.