ములుగు : దేశంలోని నలుమూలల నుంచి వచ్చే మేడారం సమ్మక్క- సారక్క భక్తుల సౌకర్యార్థం తెలంగాణ ప్రభుత్వం తగిన ఏర్పాట్లు చేసిందని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు.
సోమవారం జిల్లాలో పర్యటించి 2022 మేడారం మహా జాతర సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం సమకూర్చిన నిధులతో చేపట్టి పూర్తి చేసిన పలు అభివృద్ధి పనులను ఆమె మానుకోట ఎంపీ మాలోతు కవిత, జడ్పీ చైర్మన్ కుసుమ జగదీశ్వర్, ఎమ్మెల్యే సీతక్క తో కలిసి ప్రారంభించారు.
మేడారం మహా జాతర సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం సమకూర్చిన నిధులతో చేపట్టిన పలు అభివృద్ధి పనులను పరిశీలించారు.
అనంతరం రూ.35 లక్షల సులబ్ కాంప్లెక్స్, రూ. 10 కోట్ల తో పస్రా నుంచి భూపాలపల్లి వరకు నిర్మించిన నూతన పిటి రోడ్డు ను, రూ.25 లక్షల పంచాయతీ రాజ్ అతిథి గృహాన్ని, రూ.21 లక్షలతో వాటర్ ట్యాంక్ ను, రూ.17 లక్షలతో చేపట్టిన రోడ్డు వెడల్పు పనుల ను ప్రారంభించారు.
జాతరకు హాజరయ్యే భక్తుల సౌకర్యార్థం రాష్ట్ర ప్రభుత్వం రూ. 75 కోట్ల ను కేటాయించిందని అన్నారు. కోటి మందికి పైగా హాజరయ్యే భక్తులకు ఎటువంటి లోటుపాట్లు రాకుండా చర్యలు చేపట్టామన్నారు.
భక్తులు సైతం కరోనా నిబంధనలు పాటిస్తూ జిల్లా అధికార యంత్రాంగానికి సహకరించాలన్నారు. ఆమె వెంట జిల్లా కలెక్టర్ ఎస్ కృష్ణ ఆదిత్య, ఎస్పీ డాక్టర్ సంగ్రామ్ సింగ్ జి. పాటిల్ ఇతర అధికారులు ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.