హైదరాబాద్, అక్టోబర్ 28 (నమస్తే తెలంగాణ): కృష్ణా, గోదావరి బేసిన్ పరిధిలో రాష్ట్రంలో ఉన్న అన్ని ప్రాజెక్టులు, చెరువులను ఆటోమేషన్ చేసేందుకు చేపట్టిన తెలంగాణ ఇరిగేషన్ డిసిషన్ సపోర్ట్ సిస్టమ్ను (టీఐడీఎస్ఎస్) వచ్చే మే నాటికి పూర్తిచేయాలని సాగునీటి పారుదలశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్కుమార్ అధికారులను ఆదేశించారు. వస్సార్ ల్యాబ్ కన్సల్టెన్సీ ప్రతినిధులు, ఇరిగేషన్ శాఖ ఉన్నతాధికారులతో కలిసి టీఐడీఎస్ఎస్ పురోగతిపై ఆయన జలసౌధలో శుక్రవారం సమీక్ష నిర్వహించారు. టీఐడీఎస్ఎస్ను ఇప్పటికే కాళేశ్వరం ప్రాజెక్టులో విజయవంతంగా అమలు చేస్తున్నామన్నారు. ఇదే విధానాన్ని విడతలవారీగా రాష్ట్రంలోని అన్ని ఇరిగేషన్ ప్రాజెక్టులకు విస్తరించాలని నిర్ణయించినట్టు తెలిపారు.
పోలవరం బ్యాక్ వాటర్పై సమీక్ష
పోలవరం బ్యాక్ వాటర్ ప్రభావంపై రజత్కుమార్ సమీక్షించారు. జూలైలో గోదావరి వరదలు, ప్రభావం, నివారణ చర్యలను రూపొందించేందుకు ఓఅండ్ఎం నాగేంద్రరావు నేతృత్వంలో ఏర్పాటైన ప్రత్యేక నిపుణుల కమిటీ తన నివేదికను రజత్కుమార్కు అందజేసింది. పోలవరం వల్ల భద్రాద్రి జిల్లా బ్యాక్వాటర్, ముంపు, నీటిపారుదల మూడు అంశాల్లో ఇబ్బందులు ఉన్నట్టు తెలిపింది. బ్యాక్ వాటర్ వల్ల మరో 46 గ్రామాలు కూడా మునిగిపోతాయని పేర్కొన్నది.