జనగామ : ఖమ్మం, మహబూబాబాద్ మహిళలు మిర్చి వ్యాపారం, జనగామ మహిళలు మామిడి పండ్లు, సీతాఫలాల వ్యాపారం చేస్తున్నారు. మంచి లాభాలు వస్తున్నాయి. ఆ మాదిరిగానే ప్రతి మహిళా వ్యాపారవేత్త కావాలి. వ్యాపారం చేసేందుకు ఆసక్తి ఉన్న మహిళలు ముందుకు వస్తే.. అలాంటి వారికి హైదరాబాద్లో శిక్షణ ఇప్పిస్తామని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పేర్కొన్నారు.
పాలకుర్తి నియోజకవర్గంలో 3 వేల మంది మహిళలకు కుట్టు మిషన్ శిక్షణా తరగతుల కార్యక్రమాన్ని మంత్రి దయాకర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యాక మహిళల అభివృద్ధికి ఎంతో ప్రాధాన్యం ఇస్తున్నారు. తాగునీటి కోసం మహిళలు పడుతున్న కష్టాలను చూసిన కేసీఆర్.. ఇంటింటికి మంచినీరు అందిస్తున్నారని తెలిపారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు మహిళా సంఘాలకు రూ. 4 వేల కోట్ల రుణాలు వచ్చేవి. ఇప్పుడు రూ. 18 వేల కోట్ల రుణాలు ఇస్తున్నామని తెలిపారు. మహిళా సంఘాలు బాగా అభివృద్ధి కావాలన్నారు. గ్రామంలో ప్రతి వస్తువు మనమే తయారు చేయాలి. పసుపు, పప్పు దినుసులు, కారం అన్ని మనమే తయారు చేయాలి. డబ్బుకు ప్రభుత్వం దగ్గర ఢోకా లేదు. ఎంత డబ్బు అయినా ఇస్తాను. మీ మీద విశ్వాసం ఉందని దయాకర్ రావు పేర్కొన్నారు.
స్త్రీ నిధి కింద ఒక్కో మహిళకు రూ. 3 లక్షల చొప్పున ఇస్తున్నామని తెలిపారు. దురదృష్టవశాత్తూ చనిపోతే రుణం మాఫీ చేయమని సీఎం కేసీఆర్ చెప్పారు. ఒకవేళ సగం డబ్బులు కట్టిన తరవాత చనిపోతే మిగిలిన సగం కూడా వాపస్ ఇవ్వమన్నారని గుర్తు చేశారు. అభయ హస్తం కింద డబ్బులు కట్టిన వారికి మిత్తితో కలిపి వాపస్ ఇస్తున్నాం. డబ్బులు కట్టిన వారికి రూ. 2వేల పెన్షన్ కూడా ఇస్తామన్నారు.
సంగెం మండలంలో టెక్స్టైల్ పార్కుకు 10 వేల మంది అవసరం పడుతుందన్నారు. కొడకండ్లలో కూడా మినీ టెక్స్టైల్ పార్కు వస్తుందన్నారు. ఈ పార్కుల వల్ల మహిళలకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు. టెక్స్ టైల్ పార్కులో ఉద్యోగాలు ఇవ్వడానికి 35 సంవత్సరాల లోపు ఉన్న వారు కావాలి అని టెక్స్ టైల్ పార్క్ వాళ్ళు అడిగారు. అందుకే ఈ సారి శిక్షణ కోసం 35 ఏళ్లలోపు మహిళలు అని నిబంధన పెట్టాము. జాబ్ వద్దు అనుకున్న వాళ్ళు 40, 50 ఏళ్లు ఉన్నా సరే.. వచ్చే బ్యాచ్ లో శిక్షణ ఇస్తాం అని తెలిపారు. ఈ కుట్టు మిషన్ల శిక్షణ కోసం సెర్ప్ నుంచి రూ. 10వేలు… స్త్రీ నిధి నుంచి రూ. 7 వేల చొప్పున ఒక్కొకరిపై రూ. 17 వేలు ఖర్చు చేస్తున్నాం అని దయాకర్ రావు తెలిపారు.