హైదరాబాద్, ఏప్రిల్ 24 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని ప్రతి పల్లె ఆదర్శ గ్రామమేనని, పల్లె ప్రగతి ద్వారానే ఇది సాధ్యమైందని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవం సందర్భంగా 19 జాతీయ అవార్డులు సాధించిన ఎంపీపీలు, సర్పంచ్లను మంత్రి సత్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచనలతో రూపుదిద్దుకొన్న పల్లె ప్రగతి వల్లే రాష్ర్టానికి ఇలాంటి అవార్డులు వస్తున్నాయని చెప్పారు. 2001-2014 మధ్య తెలంగాణకు ఒకే ఒక్క అవార్డు వచ్చిందని, ఇప్పుడు ఒక్క ఏడాదే 19 అవార్డులు వచ్చాయని.. దీన్ని బట్టే రాష్ట్రంలోని పల్లెల ప్రగతి ఏ స్థాయిలో ఉన్నదో అర్థం చేసుకోవచ్చని అన్నారు. ఇన్ని అవార్డులు రావటానికి కారణమైన సీఎం కేసీఆర్కు కృతజ్ఞతలు తెలిపారు. ఇక, స్థానిక సంస్థలకు ఇచ్చే నిధుల్లో కేంద్రం కోత విధించిందని మంత్రి ఎర్రబెల్లి మండిపడ్డారు. కేంద్రం నుంచి గతంలో నెలకు రాష్ట్రానికి 300 కోట్లు వచ్చేవని, ఇప్పుడు 237 కోట్లు మాత్రమే ఇస్తున్నదని వివరించారు. నిధులు ఇవ్వకున్నా, అవార్డులు ఇస్తున్నందుకు కేంద్రానికి ప్రత్యేక ధన్యవాదాలు చెప్తున్నానని అన్నారు. అటు.. మన ఊరు మన బడి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. మే 20 నుంచి 15 రోజుల పాటు పల్లె ప్రగతిని నిర్వహిస్తామని చెప్పారు. కార్యక్రమంలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, కమిషనర్ శరత్, డిప్యూటీ కమిషనర్లు రామారావు, రవీందర్, వెస్లీ, ఇతర అధికారులు పాల్గొన్నారు.
సత్కరించిన మంత్రి కేటీఆర్
జాతీయ అవార్డులు సాధించిన స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులను ఐటీ, పరిశ్రమలు, మున్సిపల్ శాఖల మంత్రి కే తారకరామారావు ప్రగతి భవన్లో సన్మానించారు. ఇదే స్ఫూర్తితో పనిచేయాలని సూచించారు. కార్యక్రమంలో మంత్రి దయాకర్రావుతో పాటు అధికారులు పాల్గొన్నారు.