హైదరాబాద్ సిటీబ్యూరో, సెప్టెంబర్ 26 (నమస్తే తెలంగాణ): మాదాపూర్ డ్రగ్ పార్టీ నెట్వర్క్ కేసులో ఈవెంట్ నిర్వాహకులు కలహార్రెడ్డి, సూర్యనాథ్ మంగళవారం గుడిమల్కాపూర్ పోలీసుల ఎదుట లొంగిపోయారు. గుడిమల్కాపూర్, తెలంగాణ స్టేట్ యాంటి నార్కొటిక్ బ్యూరో సంయుక్తంగా గత నెలలో మాదాపూర్లో జరిగిన డ్రగ్ పార్టీపై దాడి చేసి సినీ ఫైనాన్సియర్ వెంకటరత్నాకర్రెడ్డి, భాస్కర్ బాలాజీ, మురళీలను అరెస్టు చేసిన విషయం తెలిసిందే.
వీళ్ల నెట్వర్క్లో డ్రగ్స్ తీసుకున్న వారి పేర్లను ఆరా తీయడంతో ఈ ఇద్దరు పేర్లు కూడా బయటకు వచ్చాయి. తమను పోలీసులు అరెస్టు చేస్తారనే భయంతో ముందస్తు బెయిల్ కోసం న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. పోలీసుల ముందు లొంగిపోయి, బెయిల్ తీసుకోవాలని న్యాయస్థానం ఆదేశించడంతో మంగళవారం ఈ ఇద్దరు పోలీసుల ఎదుట లొంగిపోయి బెయిల్ పొందారు. ఈ ఇద్దరు డ్రగ్ వినియోగదారుల జాబితాలో ఉండటంతో వీళ్ల నుంచి మరింత సమాచారాన్ని రాబట్టేందుకు టీనాబ్ విచారించనున్నది