హైదరాబాద్, మే 27 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో కొద్దిరోజుల నుంచి భానుడి ప్రతాపంతో అల్లాడుతున్న ప్రజలకు సాయంత్రం కురుస్తున్న వర్షాలు కాస్త ఉపసమనాన్ని కలిగిస్తున్నాయి. వేసవికాలంలో భూభాగం బాగా వేడెక్కినప్పుడు తేమ గాలుల వల్ల సాయంత్రం క్యుములోనింబస్ మేఘాలు ఏర్పడుతాయని హైదరాబాద్ వా తావరణ కేంద్రం ప్రకటన విడుదల చేసింది. ఈ కారణంగానే పిడుగులు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తున్నాయని వివరించింది. దీంతో రాష్ట్రంలో ‘హీట్వేవ్’ వర్షాలు కురుస్తాయని తెలిపింది. ప్రస్తుతం అకాల వర్షా లు కురుస్తున్నప్పటికీ ఉష్ణోగ్రతల్లో పెద్దగా మార్పు ఉండదని వెల్లడించింది. రాబోయే రెండు మూడు రోజుల్లో రుతుపవనాలు, ఆగ్నేయ, తూర్పు, మధ్య బంగాళాఖాతంలోని కొన్ని ప్రాంతాల్లో ముందుకు సాగటానికి అనుకూల పరిస్థితులు ఉన్నాయని తెలిపింది.
దీని ప్రభావంతో రాష్ట్రంలో నాలుగు రోజలుపాటు తేలికపాటి నుంచి మోస్త రు వర్షాలు కురుస్తాయని పేర్కొన్నది. గురు, శుక్రవారాల్లో పలు జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని హెచ్చరించింది. పలు జిల్లాలకు రెడ్, ఆరెంజ్ అలర్జ్ జారీ చేసినట్టు వాతావరణ శాఖ అధికారి శ్రీనివాస్ తెలిపారు. మంగళవారం 21 జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసాయని పేర్కొన్నారు. ఎక్కువగా హీట్వేవ్ ఉన్న ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని ఆయన వివరించారు. పలు జిల్లాలకు రెడ్, ఆరెంజ్ అలర్ట్ జారీ నేపథ్యంలో సీఎం రేవంత్రెడ్డి అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో అదనపు ఏర్పాట్లు చేయాలని సూచించారు.