హైదరాబాద్, డిసెంబర్ 19 (నమస్తే తెలంగాణ): పార్లమెంట్లో సభ్యులు అడిగిన ప్రశ్నలకు సైతం కేంద్ర మంత్రులు అరకొర సమాధానాలు ఇచ్చి చేతులు దులుపుకొంటున్నారు. సోమవారం బీఆర్ఎస్ ఎంపీలు దీవకొండ దామోదర్రావు, బీబీ పాటిల్ అడిగిన ప్రశ్నలకు ఇరువురు కేంద్ర మంత్రులు పూర్తి సమాచారం చెప్పలేకపోయారు. ఎంఎస్ఎంఈలకు క్రెడిట్లైన్ గ్యారంటీ స్కీంకు సంబంధించిన అంశాలపై రాజ్యసభ సభ్యుడు దీవకొండ దామోదర్రావు ప్రశ్నలు సంధించారు.
ఎంఎస్ఎంఈ రుణాలను తీర్చడానికి ఆస్తులను విక్రయించినవారి వివరాలు, వ్యాపారంలో పెట్టుబడులు పెట్టినవారి వివరాలు ఇవ్వాలని కేంద్రాన్ని కోరారు. కాగా, క్రెడిట్లైన్ గ్యారంటీ స్కీం వివరాలు మాత్రమే ఇచ్చిన కేంద్ర మంత్రి భానుప్రతాప్సింగ్వర్మ.. మిగిలిన వివరాలు తమ శాఖ వద్ద లేవని జవాబిచ్చారు. తెలంగాణలో గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణ ప్రాంతాలకు వలస వెళ్తున్న గిరిజనుల వివరాలు ఇవ్వాలని లోక్సభలో సభ్యుడు బీబీ పాటిల్ ప్రశ్నించగా.. గిరిజనుల వలసలకు సంబంధించిన సమాచారం తమ వద్ద లేదని గిరిజన సంక్షేమశాఖ మంత్రి రేణుకాంగ్ సమాధానమిచ్చారు.