Congress | హైదరాబాద్, అక్టోబర్ 17 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ పార్టీ మార్చుతున్న రోజుకో రంగును చూసి ఊసరవెల్లి కూడా బిత్తరపోతుంది. తనకు పోటీగా, తన కంటే ఎక్కువగా రంగులు మారుస్తున్న కాంగ్రెస్ అంటే ఊసరవెల్లికి కూడా కంపరమెత్తుతుందేమో అనిపిస్తున్నది ఆ పార్టీ విధానాలు చూస్తుంటే! ఒక పార్టీ అన్న తర్వాత.. అది కూడా జాతీయ పార్టీకి ఏ రాష్ట్రంలోనైనా ఒకే పాలసీ ఉండాలి. అయితే పూటకో మాట.. రాష్ర్టానికో హామీ అన్నట్టుగా, నవ్విపోదురుగాక నాకేమి సిగ్గు అనే విధంగా అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న రాష్ర్టాల్లో కాంగ్రెస్ ఇస్తున్న హామీల తీరు ఉన్నది. ఒక్కో రాష్ట్రంలో ఒక్కో విధంగా వ్యవహరిస్తూ, ఒకే పథకంపై రకరకాలుగా ప్రకటనలు చేస్తూ ఊరసవెల్లి నైజాన్ని బయటపెట్టుకొంటున్నది. ఐదు రాష్ర్టాల అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో పింఛన్లు, వంట గ్యాస్ సిలిండర్, తదితర హామీలపై ఎన్నికల రాష్ర్టాల్లో ఒకదానితో ఒకటి పొంతన లేకుండా హామీలు ఇస్తున్నది. ఇదే సమయంలో తమ పార్టీ అధికారంలో ఉన్న రాష్ర్టాల్లో ఈ పథకాలు మరోలా ఉన్నాయి. దీన్ని చూస్తుంటే ఎన్నికల్లో ఓట్ల యావ తప్ప.. ప్రజలకు మంచి చేయాలని, వారికి సంక్షేమం అందించేలానే చిత్తశుద్ధి ఇసుమంతైనా కనిపించడం లేదనే విమర్శలు వస్తున్నాయి.
తెలంగాణ, రాజస్థాన్, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, మిజోరం రాష్ర్టాల అసెంబ్లీలకు ఎన్నికలు జరుగుతుండటంతో.. కాంగ్రెస్ పార్టీ ఒకే పథకాన్ని ఒక్కో రాష్ట్రంలో రకరకాలుగా ప్రకటిస్తున్నది. తెలంగాణలో పింఛను రూ.4,000 ఇస్తామని మ్యానిఫెస్టోలో చెప్పుకొచ్చిన ఆ పార్టీ.. మిజోరంలో ఆ హామీని రూ.2,500లతో సరిపెట్టింది. అలాగే తెలంగాణలో వంట గ్యాస్ సిలిండర్ను రూ.500లకే ఇస్తామని ప్రకటించిన హస్తం పార్టీ.. మిజోరంలో మాత్రం రూ.750కి ఇస్తామంటూ సాక్షాత్తూ ఆ పార్టీ అగ్రనేత రాహుల్గాంధీ ప్రకటించడం గమనార్హం. అంతే కాకుండా తెలంగాణలో ఎన్నికల ప్రచారం సందర్భంగా ప్రజలకు రూ.10 లక్షల వరకు రాజీవ్ ఆరోగ్య బీమా ఇస్తామని ప్రకటనలు చేస్తున్న కాంగ్రెస్.. మంగళవారం మధ్యప్రదేశ్లో మ్యానిఫెస్టో విడుదల చేస్తూ అక్కడి ప్రజలకు రూ.25 లక్షల ఆరోగ్య బీమాను ప్రకటించడం అందరినీ ఆశ్చర్యచకితులను చేస్తున్నది. అలాగే తెలంగాణలో మహాలక్ష్మి పథకం కింద మహిళలకు నెలకు రూ.2,500 ఇస్తామని అంటున్న కాంగ్రెస్.. మధ్యప్రదేశ్లో మాత్రం రూ.1,500లే ఇస్తామంటూ ప్రకటించింది.
పోనీ కాంగ్రెస్ పాలిత రాష్ర్టాల్లోనైనా ఒకే విధానం ఉందా అంటే అదీలేదు. ఊరికో మాట.. పథకానికో రంగు లాగా ఉంది పరిస్థితి. ప్రస్తుతం ఎన్నికలు జరుగుతున్న రాజస్థాన్, ఛత్తీస్గఢ్లలో కాంగ్రెస్ ప్రభుత్వమే పాలిస్తున్నది. తాజాగా కర్ణాటకలోనూ కాంగ్రెస్సే అధికారంలోకి వచ్చింది. అక్కడ మరో రకంగా ఈ పథకాలు ఉన్నాయి. రాజస్థాన్లో ప్రస్తుతం 60 ఏండ్లు నిండిన వారికి నెలకు పింఛను రూ.750 మాత్రమే ఇస్తున్నారు. 80 ఏండ్లు నిండిన వారికి మాత్రం రూ.1000 ఇస్తున్నారు. కర్ణాటకలో మరోలా అమలు చేస్తున్నారు. అక్కడ 60 నుంచి 64 ఏండ్ల వారికి నెలకు రూ.600, 65 ఏండ్ల నుంచి 80 ఏండ్ల మధ్య వారికి రూ.వెయ్యి, 80 ఏండ్లకు పైబడినవారికి రూ.1,200 పింఛనుగా ఇస్తున్నారు. కర్ణాటకలో వితంతు, దివ్యాంగుల పింఛను విషయంలో కాంగ్రెస్ పార్టీ ఊసరవెల్లినే మైమరిపిస్తున్నది. పిల్లలు లేని వితంతువుకు నెలకు రూ.600, పిల్లలు ఉన్న వితంతువులకు రూ.800 చొప్పున కనికరిస్తున్నారు. దివ్యాంగుల విషయానికి వచ్చేసరికి 40 శాతం వైకల్యం ఉంటే నెలకు రూ.800 ఇస్తుండగా.. అదే 75 శాతం వైకల్యముంటే రూ.1,600 ఇస్తున్నారు.